దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ కఠిన సవాల్కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా మరోకొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో వార్నర్ సేన బరిలోకి దిగుతోంది. స్టార్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. బాసిల్ తంపి స్థానంలో షాబాజ్ నదీమ్ మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రెండు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ వైపు అడుగెస్తే.. ఓడిన జట్టు మాత్రం ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వార్నర్సేన అసమాన్య ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరి సన్రైజర్స్ ఎలా ఆడుతుందో చూడాలి.
ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో ఆరేసి విజయాలు నమోదు చేశాయి. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో మాత్రం రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. ఈ మైదానంలో రాజస్థాన్కు చెత్త రికార్డు ఉంది. 5 మ్యాచులాడి నాలుగింట్లో ఓడింది. ఇక్కడ ఆడిన మ్యాచుల్లో హైదరాబాద్ ఏడింట్లో నాలుగు గెలిచింది. దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఛేదన జట్టు కష్టపడాల్సి రావచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 160-170పరుగులు చేసే అవకాశం ఉంది.
తుది జట్లు:
రాజస్థాన్: రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్పుత్, కార్తిక్ త్యాగి.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్.
KKR vs RCB: అయ్యోరామ.. ఆర్సీబీ గెలిచిన అనంతరం కూడా రన్ తీసిన కోహ్లీ (వీడియో)