దుబాయ్: శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. ఏబీ డివిలియర్స్ మరోసారి అద్భుతం చేశాడు. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో సిక్సర్లతో తన మార్క్ విధ్వంసం సృష్టించి బెంగళూరును విజేతగా నిలిపాడు. మిస్టర్ 360 పేరుకు తగ్గట్లు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లతో ఆర్సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్; ఓ ఫోర్, 6 సిక్స్లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది.
మ్యాచ్ అనంతరం బెంగుళూరు కోచ్ సైమన్ కటిచ్ మీడియాతో మాట్లాడుతూ... నిజానికి ఈ విజయం రాజస్తాన్నే వరించాల్సి ఉందని, తనదైన విధ్వంసంతో డివిలియర్స్ మ్యాచ్ను లాగేసుకున్నాడు అని అభిప్రాయపడ్డాడు. '28 పరుగులు చేసేందుకు 16 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ మరో 6 బంతుల్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 19 ఓవర్లో వరసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఏబీడీ.. ఐదో బంతికి గురుకీరత్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. అప్పటివరకు లెగ్సైడ్ బంతులతో తక్కువ పరుగులే ఇచ్చిన ఉనాద్కత్ని రంగంలోకి దించి ఫలితం రాబడుదామనుకున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్లాన్ బెడిసికొట్టింది' అని అన్నాడు.
'చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 10 పరుగులే అవసరమవడంతో ఏబీడీ పని సులువైంది. చివరి ఓవర్ నాలుగో బంతికి మరో సిక్సర్ కొట్టిన డివిలియర్స్ ఆర్సీబీకి విజయాన్ని ఖాయం చేశాడు. అందుకే ఏబీడీని గ్రేటెస్ట్ బ్యాట్స్మన్ అంటారు. అతడు ఓ విచిత్రమైన ఆటగాడు' అని కటిచ్ ప్రశంసలు కురిపించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నాడు. క్రిస్ మోరిస్, యుజ్వేంద్ర చహల్ బాగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు.
రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జోఫ్రా 19 ఓవర్ వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. 'అంతకు ముందు చక్కగా బౌలింగ్ చేసిన ఉనాద్కత్ ఆ ఓవర్ కూడా కాపాడుతాడని అనుకున్నా. అయితే క్రీజులో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ ఏబీడీ. అందుకే ఆ ఓవర్ మా అవకాశాలను మార్చేసింది. అతనిలాగా మరే ఆటగాడు బంతిని స్టేడియం అన్ని వైపులా పరుగులెత్తించలేడు. అంత ఒత్తిడిలోనూ మెరుగైన బ్యాటింగ్తో ఏబీడీ మ్యాచ్ని మా నుంచి లాగేసుకున్నాడు' అని పేర్కొన్నాడు.
చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిరాగా.. తదుపరి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్కే పరిమితమైన డివిలియర్స్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. 12 బంతుల్లో 35 రన్స్ అవసరమైన స్థితిలో ఉనాద్కత్ వేసిన 19వ ఓవర్లో తొలి మూడు బంతులకు వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా బెంగళూరు వైపునకు తిరిగింది. గుర్కీరత్(19 నాటౌట్) ఓ బౌండరీ బాదగా.. చివరి ఓవర్లో భారీ సిక్సర్తో డివిలియర్స్ మ్యాచ్ను ముగించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
SRH vs KKR Preview: కోల్కతాతో సన్రైజర్స్ ఢీ.. ప్లేఆఫ్స్ లక్ష్యంగా బరిలోకి.. తుది జట్లు ఇవే!!