అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. ఓపెనర్ బెన్ స్టోక్స్ (107; 60 బంతుల్లో 14x4, 3x6) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (54; 31 బంతుల్లో 4x4,3x6) అర్థ శతకంతో మెరిశాడు. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును స్టోక్స్, సంజూ బాధ్యతాయుతంగా ఆడి రాజస్థాన్కు అద్భుత విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అప్పుడే గేర్ మార్చిన సూర్యకుమార్ యాదవ్ (40: 26 బంతుల్లో 4x4, 1x6)ని బోల్తా కొట్టించిన శ్రేయాస్.. అదే ఓవర్లో ముంబై హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ (6: 4 బంతుల్లో 1x6)ని వెనక్కి పంపాడు. ఓ అద్భుత డెలివరీతో పొలార్డ్ను బౌల్డ్ చేశాడు. ఆ బంతి చూసిన ముంబై తాత్కాలిక కెప్టెన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత కానీ తేరుకుని పెవిలియన్ వైపు నడిచాడు.
ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన శ్రేయాస్ గోపాల్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన కీరన్ పొలార్డ్ మంచి ఊపు మీద కనిపించాడు. అయితే ఈ సిక్స్ బాదినప్పుడే అతడు ఔట్ అవ్వాల్సింది. కానీ బౌండరీ వద్ద ఉన్న బెన్ స్టోక్స్ గాల్లోకిఎగిరినా.. బంతి అందలేదు. దాంతో పొలార్డ్ బతికిపోయాడు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అదే ఓవర్లోని చివరి బంతిని గోపాల్.. ఆఫ్ స్టంప్ లైన్పై విసిరాడు. బంతి టర్న్ అవుతుందని పొలార్డ్ ఊహించాడు. కానీ ఆ బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ని గిరాటేసింది. ఆఖరి క్షణంలో దాన్ని అడ్డుకునేందుకు పొలార్డ్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. బంతిని అడ్డుకునే క్రమంలో పొలార్డ్ బ్యాలెన్స్ కోల్పోయి.. కిందపడిపోయేలా కనిపించినా బ్యాట్ సాయంతో కుదురుకున్నాడు. బ్యాట్, ఫ్యాడ్స్ మధ్యలో నుంచి బంతి వెళ్లిన తీరుకి ఆశ్చర్యపోవడం పొలార్డ్ వంతైంది.
లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో కీరన్ పొలార్డ్ తడబడటం ఇదే తొలిసారి కాదు. బ్యాట్ కిందకు వచ్చే బంతుల్ని స్టాండ్స్లోకి తరలించే పొలార్డ్.. అదే ఊపులో క్యాచ్లు ఇచ్చేయడం లేదా క్లీన్ బౌల్ట్ అవ్వడం చేస్తుంటాడు. దాంతో తెలివిగా అతనిపై మ్యాచ్లో శ్రేయాస్ గోపాల్ని ప్రయోగించి రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫలితం రాబట్టాడు. గోపాల్ తన కోటా 4 ఓవర్లలో 30 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు కీలక సమయంలో పొలార్డ్ 4 బంతులే ఎదుర్కొని బౌల్డ్ అయ్యాడు.
ప్లేఆఫ్స్ నుంచి చెన్నై నిష్క్రమణ.. సాక్షి ధోనీ భావోద్వేగం.. కేవలం ఆట మాత్రమే అంటూ!!