
అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యంను రాజస్థాన్ ఓపెనర్ బెన్ స్టోక్స్ (107; 60 బంతుల్లో 14x4, 3x6), యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (54; 31 బంతుల్లో 4x4, 3x6) తమ అద్భుత బ్యాటింగ్తో ఊదేశారు. ముఖ్యంగా స్టోక్స్ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. అతడి ఇన్నింగ్స్ ముందు భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఈ క్రమంలో రాజస్థాన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించడంతో ఓ సరికొత్త రికార్డు నమోదయింది. ముంబైపై రికార్డు ఛేదన చేసిన జట్టుగా రాజస్థాన్ రికార్డుల్లోకి ఎక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ 2018 సీజన్లో ముంబైపై 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక చేదనగా ఉంది. ఆదివారం ఆ రికార్డును రాజస్థాన్ అధిగమించింది. మరోవైపు ముంబైపైనే రాజస్థాన్ గతేడాది 188 లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 2017లో రైజింగ్ పుణె సూపర్జెయింట్ 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రతిష్ఠ బౌలింగ్ లైనప్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మిచెల్ మెక్క్లెనఘన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్ లాంటి స్టార్ పేసర్లు ఆ జట్టు సొంతం. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్ లాంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. వీరి ధాటిని తట్టుకుని ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను ఛేదించడం కాస్త కష్టమే. బ్యాట్స్మన్ తక్కువ పరుగులు చేసిన సమయంలో జట్టును బౌలర్లు ఆదుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ముంబై భారీ స్కోర్ చేసిందంటే ఎక్కువగా విజయాలు అందుకుంటుంది.
ఐపీఎల్లో రాయల్స్ బ్యాట్సమన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. ముంబైతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో అజేయ సెంచరీ (107)తో రాజస్థాన్ను గెలిపించాడు. సరిగ్గా ఇలాంటి ఫీట్నే 2017 ఐపీఎల్ సీజన్లోనూ నమోదు చేశాడు. గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో పుణె తరపున ఛేజింగ్కు దిగి అజేయ శతకం (103)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఛేజింగ్లో స్టోక్స్ రెండుసార్లు సెంచరీలు కొట్టగా.. రెండుసార్లూ ఆయా జట్లు గెలిచాయి. ఇక రాయల్స్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా తన పేరిట లిఖించుకున్నాడు.