షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో మరికొద్ది సేపట్లో మరో బిగ్ఫైట్ జరగనుంది. షార్జా క్రికెట్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంజాబ్ జట్టులో నికోలస్ పూరన్కు మరో ఛాన్స్ దక్కింది.
గత మ్యాచ్ల్లో రెండూ జట్లు ఆల్రౌండ్ షోతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపించాయి. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో పాటు మైదానం చిన్నది కావడంతో ఈ మ్యాచ్లో కురిసే సిక్సర్ల వర్షంతో అభిమానులు తడిసి మద్దవ్వనున్నారు. బలబలాల పరంగా పేపర్పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. అనుభవం దృష్ట్యా కింగ్స్ పంజాబ్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్లో ఉండగా.. బౌలింగ్ విభాగం కూడా పటిష్ఠంగానే ఉంది. మరోవైపు రాజస్థాన్ యువ ఆటగాడు సంజూ శాంసన్పైనే అందరి దృష్టినెలకొంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 19 సార్లు తలపడగా.. 10-9తో రాజస్థాన్ లీడ్లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని రాజస్థాన్ భావిస్తుండగా.. గెలుపుతో లెక్క సరిచేయాలని కింగ్స్ పంజాబ్ పట్టుదలగా ఉంది. యూఏఈలోనే చాలా నెమ్మదైన పిచ్. అలాగే స్పిన్కు అనుకూలమైనది. కొత్త బంతితో పేసర్లు ప్రభావం చూపుతారు. చిన్నమైదానం కాబట్టి సిక్సర్లతో ఇరు జట్ల స్కోర్ సులువుగా 200 ధాటవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు:
రాజస్థాన్: జోస్ బట్లర్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, అంకిత్ రాజపుత్.
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, జిమ్మీ నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్.