
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రాజస్థాన్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (2/18) కోల్కతా బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు. అతనికి తోడు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో వరుస విరామాల్లో కోల్కతా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (47 34 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరలో ఇయాన్ మోర్గాన్ (34 నాటౌట్ 23 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) ఆదుకోవడంలో 174 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 175 పరుగుల లక్ష్యంను ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు శుభారంభం దక్కలేదు. వరుసగా మూడో మ్యాచ్లోనూ సునీల్ నరైన్ ఓపెనర్గా విఫలమయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్లో నరైన్ (15: 14 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) వరుసగా సిక్స్, ఫోర్ బాది.. తర్వాతి బంతికే బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు నితీశ్ రాణా జతకలవడంతో స్కోర్ వేగం పెరిగింది. అయితే రాణా, గిల్ ఆచితూచే ఆడారు.
గిల్ కొన్ని మంచి షాట్లతో అలరించాడు. ఇక రాయల్స్ స్కోర్ వేగం పుంజుకునే సమయంలో రాహుల్ తెవాటియా.. రాణాను ఔట్ చేశాడు. 10వ ఓవర్లో రాణా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇక అర్ధ శతకం దిశగా సాగుతున్న గిల్ అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. ఆర్చర్ వేసిన 12వ ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్ది సేపటికే కెప్టెన్ దినేష్ కార్తీక్ (1) ఔట్ అయి మరోసారి విఫలమయ్యాడు. ఇక హిట్టర్ ఆండ్రూ రస్సెల్ మూడు సిక్సులు బాదినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. స్కోరు వేగం మందగించడంతో రస్సెల్ భారీ షాట్లతో చెలరేగే ప్రయత్నం చేసి.. రాజ్పుత్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
ఇక 17 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్ క్రీజులో నిలదొక్కుకొని కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కమిన్స్ (12) కూడా ఔట్ అవ్వడంతో భారం మొత్తం మోర్గాన్పైనే పడడంతో స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. చివరకు రెండు సిక్సులు బాది 34 రన్స్ చేశాడు. మొత్తానికి కోల్కతా ఇన్నింగ్స్ మెరుపులు లేకుండానే ముగిసింది.