డివిలియర్స్, కోహ్లీ బలం:
గత కొన్నేళ్లుగా జట్టు భారాన్ని మోస్తుంది ఆ ఇద్దరు మాత్రమే. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. వీళ్లే ఆ జట్టుకు తిరుగులేని బలం. ఈ జోడి క్రీజులో కుదురుకుంటే పరుగుల వరదే. ఒక్కరు విఫలమయినా.. మరొకరిపై అధికభారం పడుతోంది. ఇక అంతర్జాతీయ టీ20 ఉత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ రాణిస్తే.. కోహ్లీ, డివిలియర్స్లపై భారం తగ్గుతుంది. దేశవాళీ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ ఫించ్కు జతగా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
జోష్ ఫిలిప్పి ప్రధాన ఆకర్షణ:
వేలంలో రూ.10 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ చేరిక ఆర్సీబీ జట్టు బలాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీలక సమయంలో బ్యాట్ జులిపించగలడు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సామర్థ్యం అతనిది. ఆసీస్కు చెందిన యువ సంచలనం జోష్ ఫిలిప్పి ప్రధాన ఆకర్షణ కావొచ్చు. బిగ్బాష్ లీగ్ లీగ్లో రాణించిన ఫిలిప్పిని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తీసుకుంది. వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తాడనే ఆశతో కోహ్లీ ఉన్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు పార్థివ్ పటేల్ కూడా ఉన్నాడు.
ఆల్రౌండర్లకు కొదవలేదు:
మొయిన్ అలీ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి లాంటి స్టార్ ఆల్రౌండర్లు కూడా ఆర్సీబీ జట్టులో ఉన్నారు. పేస్ విభాగంలో క్రిస్ మోరిస్, ఉరుసు ఉడాన, డేల్ స్టెయిన్లతో పాటు భారత పేసర్లు ఉమేష్ ఉమేశ్, నవ్దీప్ సైనీ, మొహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నారు. యూఏఈ పిచ్లు స్పిన్కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, మొయిన్ అలీ, పవన్ నేగిలతో కూడిన స్పిన్ బలగం పటిష్ఠంగా కనిపిస్తోంది.
అదే అసలైన బలహీనత:
కోహ్లీ, డివిలియర్స్ జట్టుకు బలహీనత కూడా. వాళ్ల మీదే జట్టు అతిగా ఆధారపడటం పెద్ద సమస్యగా మారింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మెరుగైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఐపీఎల్లో అతడి నాయకత్వ లక్షణాలపై సందేహాలు రేకెత్తిస్తున్నాడు. సహచరుల్లో విశ్వాసం నింపడం, ఒత్తిడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జట్టును అతను తన ప్రత్యేకతను చాటుకోవాల్సి ఉంది. పేస్ బౌలర్లు డెత్ ఓవర్లలో రాణించకపోవడమే ఆర్సీబీకి ఉన్న ప్రధాన మైనస్. ఉమేశ్, సైనీ, సిరాజ్లో చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టును కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్లే ఆఫ్స్ చేరొచ్చు:
ఈసారి ఆర్సీబీ జట్టులోకి కీలక బ్యాట్స్మన్లు, బౌలర్లు వచ్చారు. వేలంలో ఆర్సీబీ యాజమాన్యం ఆచితూచి అడుగేసింది. ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్పి, క్రిస్ మోరిస్, బ్యాటింగ్, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపాలను తీసుకుని బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసింది. ఇక ఆరంభ మ్యాచ్ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ విజయాలు సాధిస్తేనే బెంగళూరు కథ మారుతుంది. ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
జట్టు:
ఆరోన్ ఫించ్, దేవ్దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్పె, గుర్కీరత్ సింగ్, పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, శివమ్ దూబె, క్రిస్ మోరిస్, పవన్ దేశ్పాండే, షాబాజ్ అహ్మద్, ఉమేశ్యాదవ్, యుజువేంద్ర చహల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా, ఉరుసు ఉడాన.