
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. 8 మ్యాచ్లు ఆడి ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా సామర్థ్యానికి తగ్గట్టు ఆడడం లేదని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ప్లే ఆఫ్ బెర్త్ సాధించాలంటే ఢిల్లీ.. తర్వాతి ఆరు మ్యాచుల్లో రెండింటిలో గెలిస్తే సరిపోతుంది. ఇక మూడు మ్యాచులు గెలిస్తే.. అధికారిక బెర్త్ సాధిస్తుంది.
'ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి మా ఆటగాళ్లకు ఒకటే విషయం చెబుతున్నా. తొలి అర్ధ భాగంలో అంతబాగా ఆడాల్సిన అవసరం లేదు. రెండో అర్ధ భాగంలో మాత్రం పూర్తి సామర్థ్యంతో ఆడాల్సి ఉంటుందని ఆటగాళ్లకు చెప్పా. ఇక్కడి పిచ్లు క్రమంగా నెమ్మదిస్తాయని నేను చెబుతున్నది నిజమైంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ అందుకు మంచి ఉదాహరణ. ఆ మ్యాచ్లో 162 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించడం కష్టమని నేను చెప్పినట్టే జరిగింది' అని రికీ పాంటింగ్ చెప్పాడు.
యూఏఈలో అడుగుపెట్టినప్పుడు వికెట్పై పచ్చిక, తేమ ఉండడంతో ఐపీఎల్ టోర్నీ తొలి అర్ధ భాగంలో ఛేజింగ్ సులభమని అందరూ భావించారని, అయితే రెండో అర్ధ భాగంలో మాత్రం ఛేజింగ్ కష్టమని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. తొలుత తాము బ్యాటింగ్ చేయడం వల్లే ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో విజయం సాధించినట్టు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో ఆరింటిలో గెలిచినప్పటికీ తాము బెస్ట్ క్రికెట్ను ఇప్పటి వరకు ఆడలేదన్నాడు.
ఐపీఎల్ టైటిల్ను మూడుసార్లు ఎగరేసుకుపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి చతికిల పడుతుండడంపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ... అంతమాత్రాన తాము చెన్నైని తేలిగ్గా తీసుకోబోమన్నాడు. ఆ జట్టులో షేన్ వాట్సన్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్ వంటివారు ఉన్నారని, వారిని తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశాడు. అటగాళ్లు అందరూ బాగా ఆడుతున్నారని, ప్లే ఆఫ్ బెర్త్ కచ్చితంగా సాధిస్తామని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.