
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మార్క్ అందుకున్నాడు. గురువారం షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్.. కోహ్లీకి ఆర్సీబీ తరఫున 200వ గేమ్. 2008 ఐపీఎల్ వేలంలో కోహ్లీని ఆర్సీబీ తీసుకున్నది. అప్పటి నుంచి విరాట్ అదే జట్టుకు ఆడుతున్నాడు. ఇది ఐపీఎల్లో కోహ్లీకి ఆర్సీబీ తరపున 185 మ్యాచ్ కాగా.. చాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ20) అదే ప్రాంఛైజీ తరఫున 15 మ్యాచ్లు ఆడాడు. ఫలితంగా ఒక ఫ్రాంచైజీకి 200వ మ్యాచ్ ఆడుతున్న ఘనతను విరాట్ నమోదు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 117 మ్యాచ్లకు కెప్టెన్గా చేసిన విరాట్ కోహ్లీ.. ఆ టీంకు 55 విజయాలు అందించాడు. విరాట్ నేతృత్వంలో ఆర్సీబీ 58 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇక నాలుగు మ్యాచ్లు రద్దయ్యాయి. 2008 ఐపీఎల్ వేలంలో కోహ్లీని ఆర్సీబీ తీసుకున్నది. అప్పటి నుంచి కోహ్లీ 38.55 సగటుతో 5,668 పరుగులతో 131.41 స్ట్రైక్ రేట్ను సాధించాడు. ఐపీఎల్లో కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు. ఇక 38 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోర్ 113.
ఈ మ్యాచుకు ముందు పిచ్ దగ్గరికొచ్చి పరిశీలించిన విరాట్ కోహ్లీ.. అనంతరం అక్కడే గడ్డిలో డ్యాన్స్ చేస్తూ సహా క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. కోహ్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. మైదానంలో గూఫీ స్టెప్పులేస్తూ నవ్వుతూ ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడి సహచరులు చుట్టుముట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్దిసేపటికే 6 లక్షలకు పైగా వ్యూస్.. 3 లక్షల లైకులు వచ్చాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 172 పరుగుల లక్షాన్ని ఉంచింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (48; 39 బంతుల్లో 3 ఫోర్లు) హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో క్రిస్ మోరిస్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్తో జట్టు స్కోరును 170 దాటించాడు. అరోన్ ఫించ్ (20), శివమ్ దూబే (23) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లు మొహమ్మద్ షమీ, మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.