ఆటాడుకున్న నెటిజన్లు:
ముంబైతో జరిగిన మ్యాచ్ల్లో సీనియర్లు కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాను పక్కనబెట్టిన ఎంఎస్ ధోనీ.. యువ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఎన్ జగదీశన్కు అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. దీంతో ఇద్దరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు ఆటాడుకున్నారు. ధోనీ చెప్పినట్లుగానే వారిలో స్పార్క్ కనిపించలేదని, ఆడాలన్న కసి కాదుగా.. ఓపిక కూడా లేదని దుమ్మెత్తిపోశారు. ధోనీకి మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగించారు.
మొన్న రుతురాజ్ను తిట్టిన వారే:
ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి రుతురాజ్, జగదీశన్కు అవకాశమిచ్చాడు. ఈ మ్యాచ్లో మాత్రం రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. అందివచ్చిన అవకావాన్ని వినియోగించుకున్నాడు. 51 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫాఫ్ డుప్లెసిస్ (25), అంబటి రాయుడు (39)లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆపై ధోనీతో కలిసి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దాంతో మొన్న రుతురాజ్ను తిట్టిన వారే ఇవాళ పొగుడుతున్నారు. #Spark హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. కుర్రాళ్లలో ఇప్పుడు స్కార్క్ కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు.
స్కార్క్ ఇన్నింగ్స్ అంటే ఇదే:
హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 'స్కార్క్ కనిపించింది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'స్కార్క్ ఇన్నింగ్స్ అంటే ఇదే' మరొకరు ట్వీటారు. కుర్రాళ్లకు అవకాశాలిస్తే అద్భుతంగా రాణిస్తారని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టకూడదని.. కొన్ని ఛాన్స్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇంకొందరు ధోనీని విమర్శిస్తున్నారు. 'ధోనీ.. ఇప్పటికైనా నీకు స్కార్క్ కనిపించిందా?' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.