
దుబాయ్: ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అత్యుత్తమ ఎకానమీ నమోదు చేస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ ఐదు వికెట్లను మాత్రమే తీసిన సుందర్.. పరుగుల ఇవ్వడంలో మాత్రం పిసినారిగా మారాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఎకానమీ పరంగా టాప్ లేపుతున్నాడు. అతని ఎకానమీనే ఆర్సీబీకి కొన్ని అద్భుతమైన విజయాలను సాధించి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తూ అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. అత్యుత్తమ ఎకానమీ జాబితాలో సుందర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 4.90 ఎకానమీ నమోదు చేశాడు. ఓవర్కు ఐదు పరుగులు కంటే తక్కువ ఇస్తున్నాడు. ఐపీఎల్ 2020లో సుందర్ ఇప్పటివరకూ 22 ఓవర్లు వేసి 108 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇంత బాగా బౌలింగ్ చేయడానికి అసలు కారణం టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీనే అని సుందర్ చెప్పాడు.

'గతంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే ఆడాను. అప్పుడు నేను క్రికెటర్గా పరిపక్వత సాధించడానికి మహీ చేసిన సాయం మరువలేనిది. పుణెకు ఆడిన సమయంలోనే నేను బాగా మెరుగయ్యా. అందుకు కారణం మహీ భాయ్. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఒక బౌలర్గా ఎదిగింది మహీ నాయకత్వంలోనే. నేను ఈ స్థాయిలో ఉండటానికి ధోనీనే కారణం' అని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు.
కింగ్స్ పంజాబ్తో గురువారం మ్యాచ్ జరుగనున్న సంర్భంగా వాషింగ్టన్ సుందర్ మాట్లాడాడు. బ్యాట్స్మన్ను ఎలా బోల్తా కొట్టిస్తున్నాడో చెప్పాడు. 'మనం బంతిని కొద్ది ఆలస్యంగా చేతి నుంచి రిలీజ్ చేయడమే ప్రధానమైనది. బ్యాట్స్మన్ ఫుట్వర్క్ను ఫాలో అయితే బంతిని వేయడం సులువుగా ఉంటుంది. బ్యాట్స్మన్ ఏమీ చేయబోతున్నాడు అనేది మనం బంతిని ఆలస్యంగా విడుదల చేయడంపైనే ఉంటుంది. బంతిని వీలైనంత ఆలస్యంగా విడుదల చేయడం గురించి నాకు అవగాహన ఉంది. అదే నా అసలు టెక్నిక్' అని సుందర్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తనపై చాలా నమ్మకం ఉంచాడని, పవర్ప్లేలో బౌలింగ్ చేయిస్తున్నాడని చెప్పాడు.