ఆస్ట్రేలియా పర్యటన.. రోహిత్ను ఎందుకు పక్కబెట్టారో చెప్పిన రవిశాస్త్రి!!

దుబాయ్: ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనకు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ ప్యానెల్ ఒక్క ఫార్మాట్కు కూడా ఎంపిక చేయని విషయం తెలిసిందే. రోహిత్ వేటుపై తీవ్ర దుమారం రేగింది. గాయం కారణంగా రోహిత్ను ఎంపిక చేయలేదని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాలే కారణమని భావిస్తున్నారు.

ఆ రిపోర్ట్ కారణంగానే
ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ప్రకటించిన కొదిసేపటికే రోహిత్ శర్మ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు. ఇక మాజీ క్రికెటర్లు, అభిమానులు బీసీసీఐపై దుమ్మెత్తిపోసారు. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ.. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని ప్రకటించింది. అయినా కూడా ఫ్యాన్స్ శాంతించలేదు.

మరోసారి గాయపడే ప్రమాదం
ఐపీఎల్ 2020లో గాయపడిన పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను ఆస్ట్రేలియా పర్యటనలో మూడు ఫార్మాట్లకూ ఎంపిక చేసిన సెలక్టర్లు.. రోహిత్ శర్మను మాత్రం ఎందుకు పక్కనబెట్టారని భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈలోనే ఉన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా స్పందించాడు. బీసీసీఐ మెడికల్ టీం సమర్పించిన నివేదిక ఆధారంగానే.. రోహిత్ను పక్కనబెట్టినట్టు తెలిపాడు. రోహిత్ మరోసారి గాయపడే ప్రమాదం ఉందని మెడికల్ టీం రిపోర్ట్ ఇచ్చిందని, అందుకే సెలక్టర్లు అతడి ఎంపికను పరిగణలోకి తీసుకోలేదని చెప్పాడు.

ఆ విషయంలో తలదూర్చలేదు
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మను ఎంపిక చేసే వ్యవహారంలో తాను తలదూర్చలేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. సెలక్షన్ కమిటీ వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నాడు. అన్ని వ్యవహారాలు సెలక్షన్ కమిటీ చూసుకుంటున్నాడు. రోహిత్ మరోసారి గాయపడే ప్రమాదం ఉందని మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన విషయం మాత్రమే తనకు తెలుసని శాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే సెలక్షన్ కమిటీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని రవిశాస్త్రి చెపుతున్నా.. ఫాన్స్ మాత్రం అతనిపై మండిపడుతూనే ఉన్నారు. కోచ్ అయిన నువ్.. ఆటగాళ్ల ఎంపిక విషయం తెలియదని చెపుతున్నావా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

నవంబర్ 12న ఆస్ట్రేలియాకు
మరోవైపు బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ గాయాన్ని ఆదివారం పరీశిలించనుందని సమాచారం తెలిపింది. గాయం తీవ్రతను బట్టి ఆసీస్కు పంపించాలా? వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు నవంబర్ 12న ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ టూర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications