
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని ప్రాంఛైజీలు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్కు ఇంకా వారం రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో కూడా ఏమాత్రం జోష్ తగ్గకుండా ప్రాంఛైజీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా రాజాస్ధాన్ రాయల్స్ ప్రాంచైజీ 13వ సీజన్ కోసం ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందించింది. అయితే వినూత్న రీతిలో జెర్సీని అవిష్కరించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని ఒక బీచ్లో స్కైడైవర్ విమానం నుంచి దూకుతూ రాజాస్ధాన్ రాయల్స్ జెర్సీని అవిష్కరించారు. రాయల్ మిరాజ్ రిసార్ట్ వద్ద దిగిన రోమన్ రాయల్స్ .. రాయల్స్ ప్లేయర్లకు కొత్త జెర్సీలను అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చెస్తోంది. రాయల్ లుక్లో రాజస్థాన్ ఐపీఎల్ 2020 జెర్సీ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2020 కోసం ఇప్పుడే జెర్సీ ల్యాండ్ అయిందనే క్యాప్షన్తో కొత్త వేదిక, కొత్త జెర్సీ అర్ధం వచ్చేలా ఆ వీడియోను రాజాస్ధాన్ రాయల్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆటగాళ్లు బీచ్ ఒడ్డున జెర్సీ వేసుకుని.. హీరోల్లా నడిచి వస్తున్నారు. ముఖ్యంగా జోస్ బట్లర్ లుక్ అదిరింది. ఇక ఐపీఎల్-13వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభంకానుండగా.. రాజస్థాన్ 22న షార్జాలో జరిగే తన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్కు ఆగస్టు 12న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అన్ని జాగ్రత్తల నడుమ 14 రోజుల పాటు స్వస్థలం ఉదయ్పూర్లో ఉన్న ఆసుపత్రిలో చేరారు. అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత, రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. దీంతో ఇటీవలే అతడు యూఏఈ బయల్దేరారు. రాయల్స్ బృదంలో దిశాంత్కు తప్ప ఎవరూ వైరస్ బారిన పడలేదు. ప్రాంచైజీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.