|
కోహ్లీని మీ జట్టులోకి ఆహ్వానిస్తారా?:
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 మ్యాచులు నేరుగా చూసే అవకాశం లేకున్నా.. టీవీల్లోనైనా చూద్దామని అభిమానులు సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యంలో ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు సోషల్ మీడియాల్లో చాట్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని ఓ అభిమాని ఊహించని ప్రశ్న వేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని మీ జట్టులోకి ఆహ్వానిస్తారా? అని అడిగాడు. అయితే రాయల్స్ ఫ్రాంఛైజీ మాత్రం ఇక్కడ ఓ కండీషన్ పెట్టింది.
|
నాగాస్ వస్తేనే కోహ్లీని ఆహ్వానిస్తాం:
అభిమాని అడిగిన ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ ఇలా బదులిచ్చింది. 'విరాట్ కోహ్లీని కచ్చితంగా తీసుకుంటాం. కోహ్లీతో పాటు ఆ జట్టు బ్యాక్రూమ్ స్టాఫ్ మెంబర్ మిస్టర్ నాగాస్ వస్తేనే కోహ్లీని ఆహ్వానిస్తాం' అని రాయల్స్ కండీషన్ పెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ప్రమోట్ చేసేవాళ్లలో నాగాస్ కూడా ఒకడు. టోర్నీ సమయంలో బెంగళూరు ఆటగాళ్లని సరదాగా ఇంటర్వ్యూ చేసే నాగాస్.. మ్యాచ్లు ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూములో జరిగే సంబరాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. నాగాస్ హెయిర్ స్టయిల్, మీసం, భాష ఫ్యాన్స్ని ఆకట్టుకుంటాయి.
ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరుతోనే:
ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు. మొదట్లో ఓ ఆటగాడిగా జట్టులో చేరిన కోహ్లీ.. ఇప్పుడు కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 177 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 131.63 స్ట్రైక్రేట్తో 4,112 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు 36 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు.
ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు:
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అయినా ఆర్సీబీ అభిమానులు ఆ జట్టుకు అండగా ఉండడం విశేషం.