
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)కు శుభవార్త. రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వరుసగా రెండు కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఐపీఎల్ 2020 వేదికైన దుబాయ్కి ఈరోజు ఉదయం చేరుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్ యాగ్నిక్కు ఆగస్టు రెండో వారంలో కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్కు ఆగస్టు 12న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అన్ని జాగ్రత్తల నడుమ 14 రోజుల పాటు స్వస్థలం ఉదయ్పూర్లో ఉన్న ఆసుపత్రిలో చేరారు. అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత, రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి యూఏఈ బయల్దేరారు.
అయితే దిశాంత్ యాగ్నిక్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కలవడానికి కంటే ముందు అతడు మరో ఆరు రోజుపాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సి ఉంది. ఆ సమయంలో కూడా వైరస్ పరీక్షలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జట్టుతో కలిసే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ 2020 టోర్నీ ప్రారంభానికి ముందు మూడుసార్లు కరోనా నెగెటివ్గా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ అయిన దిశాంత్ యాగ్నిక్.. రాజస్థాన్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫునే బరిలోకి దిగారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ టోర్నీ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మూడు నగరాల్లో జరగనుంది. అయితే ఐపీఎల్ 2020 షెడ్యూల్ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.