
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫయర్-2 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మార్కస్ స్టోయినీస్ అదరగొట్టారు. సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. అయితే స్టోయినీస్ 38 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. ధావన్ సిక్స్ బాది తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధావన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. స్టోయినీస్ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాట్ జులిపించడంతో ఢిల్లీ భారీ స్కోరుపై కన్నేసింది.
ధావన్, స్టోయినీస్ ఇద్దరూ తొలి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు. స్టాయినీస్ 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్లో స్టాయినీస్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను మిడాన్లో హోల్డర్ వదిలేశాడు. అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్కు ఊపుతీసుకొచ్చాడు. హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో స్టాయినీస్ మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టి 18 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
సందీప్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో ఐదో ఓవర్లోనే ఢిల్లీ స్కోరు 50 మార్క్ దాటింది. శాబాజ్ నదీమ్ వేసిన ఆరో ఓవర్లో ధావన్ ఫోర్, సిక్సర్ కొట్టడంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 65/0తో పటిష్ఠస్థితిలో నిలిచింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా భారీగానే పరుగులు ఇచ్చుకోవడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. అయితే 9వ ఓవర్ రెండో బంతికి స్టాయినీస్ వికెట్ తీసిన రషీద్.. సన్రైజర్స్ జట్టులో సంతోషం తీసుకొచ్చాడు.
ఆ తర్వాతి ఓవర్లో ధావన్ సిక్స్ బాది హాఫ్ సెంచరీ చేశాడు. ఇదే సమయంలో సన్రైజర్స్ బౌలర్లు కాస్త పుంజుకోవడంతో ఢిల్లీ బ్యాట్స్మన్ ఎక్కువగా బౌండరీలు బాధలేకపోయారు. దీంతో ఢిల్లీ స్కోర్ వేగం కాస్త తగ్గింది. ధాటిగా ఆడే క్రమంలో 14వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ (21) అవుట్ అయ్యాడు. వికెట్ పడినా కూడా ధావన్ వేగంగానే ఆడుతున్నాడు. ఢిల్లీ 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెట్మెయర్ (7), ధావన్ (68) క్రీజులో ఉన్నారు.