
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో మరో ఆసక్తికర పోరుకి సమయం ఆసన్నమైంది. క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం అయ్యర్ రెండు మార్పులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా, ఫాస్ట్ బౌలర్ డేనియల్ శ్యామ్పై వేటు పడగా.. వారి స్థానాల్లో ప్రవీణ్ దుబే, సిమ్రాన్ హిట్మెయర్ జట్టులోకి వచ్చారు. మరోవైపు సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎలాంటి మార్పులు చేయలేదు. గాయం కారణంగా సాహా ఈ మ్యాచ్ కూడా ఆడడం లేదు.
వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. గట్టిగా పుంజుకొని తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. చివరి నాలుగు మ్యాచ్ల్లో సంచలన విజయాలు నమోదు చేసిన వార్నర్సేన.. ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో దిగుతోంది. మరోవైపు చివరి ఆరు మ్యాచ్ల్లో ఐదు పరాజయాలతో ఢీలాపడిన ఢిల్లీ ఒత్తిడిని జయించి సమిష్టిగా రాణించాలనుకుంటోంది.
ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ హైదరాబాద్దే పైచేయి అయింది. రెండు సార్లూ మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్.. తొలిసారి బౌలింగ్ బలంతో, రెండోసారి బ్యాటింగ్తో గెలిచింది. ఈ రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్ బౌలర్లు 17 వికెట్లు పడగొడితే.. ఢిల్లీ బౌలర్లు 6 వికెట్లే తీశారు. రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 6 వికెట్లు పడ గొట్టడం కొసమెరుపు.
అబుదాబిలో జరిగిన గత తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిదింట ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక ఉత్కంఠ పోరాటాల్లో తేలిపోయే ఢిల్లీ.. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏడు ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడి అందులో ఆరింట ఓడింది. ఆ గెలిచిన ఒక్కటి హైదరాబాద్పైనే కావడం క్యాపిటల్స్కు ఊరటనిచ్చే అంశం.
తుది జట్లు:
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవాత్సవ్ గోస్వామి, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, నటరాజన్, సందీప్ శర్మ.
ఢిల్లీ: శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మైయర్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నోర్జె.