ఐపీఎల్కు సిద్ధంగా ఉండండి:
ఐసీసీ నిర్ణయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా వేగవంతం చేసింది. టీ20 ప్రపంచకప్పై జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్ 2020ని జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనిలో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ లేఖ రాశాడు.
అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే:
'కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్ 2020 నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. అన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ను నిర్వహిస్తాం. అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లీగ్ ఆడటానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అభిమానులు, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లు, ప్రసారదారులు, స్పాన్సర్లు ఈ సంవత్సరం ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' అని బీసీసీఐ అధ్యక్షుడు లేఖలో రాసుకొచ్చాడు. కచ్చితంగా ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందనే ఆశాభవాన్ని దాదా వ్యక్తం చేసాడు.
విదేశీ ఆటగాళ్లు సైతం?:
భారత క్రికెటర్లే కాకుండా, విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ 2020 ఆడతామనే సంకేతాలు ఇచ్చిన విషయాన్ని సౌరవ్ గంగూలీ లేఖ ప్రస్తావించాడు. ఐపీఎల్ నిర్వహణపై సాధ్యమైనంత తొందర్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేసాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. అయితే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ని ఐసీసీ వాయిదా వేయాలని చూస్తుంది. ఒకవేళ వాయిదా పడితే.. ఐపీఎల్ సాధ్యపడుతుందనేది దాదా లేఖ సారాంశం. దీనిలో భాగంగానే అన్ని క్రికెట్ అసోసియేషన్లను సిద్ధంగా ఉండాలని ముందుగా విజ్ఞప్తి చేశాడు.
భారత్లోనే లీగ్?:
విదేశాల్లో అయినా ఐపీఎల్ 2020 నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. 'ఐపీఎల్ 2002ని నిర్వహించేందుకే చూస్తున్నాం. బోర్డు ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ చివరిగా విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే.. అదీ చేస్తాం. విదేశాల్లో లీగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. కానీ భారత్లో లీగ్ నిర్వహించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం' అని సదరు అధికారి తెలిపారు. అయితే దాదా మాటలను బట్టి చూస్తే.. భారత్లోనే లీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.