
హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీ సగం సీజన్ పూర్తయింది. లీగ్ దశలో అన్ని జట్లూ ఏడేసి మ్యాచులు ఆడేశాయి. లీగ్ దశలో జట్లన్నీ మరో ఏడేసి మ్యాచ్లు ఆడనున్నాయి. ఇప్పటి వరకూ జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడు మ్యాచ్ల్లో ఈ జట్లు ఐదేసి విజయాలు సాధించాయి. ఇకపై ఆడే ఏడు మ్యాచ్లో.. మూడు గెలిస్తే ఈ జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. హిట్టర్లతో నిండిన కోల్కతా సైతం 8 పాయింట్లతో దూకుడుగానే ఉంది. టాప్-4 వీటితో నిండింది. ఇక పరుగుల వీరులు, వికెట్ల ధీరుల జాబితాను ఓసారి పరిశీలిస్తే...
ఐపీఎల్ 2020లో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (387), మయాంక్ అగర్వాల్ (337) అదరగొడుతున్నారు. వీరిద్దరూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. చెన్నై బ్యాట్స్మన్ ఫాఫ్ డుప్లెసిస్ (307) మూడులో ఉన్నాడు. ఆపై హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (275), ఓపెనర్ జానీ బెయిర్ స్టో (257)లు ఉన్నారు. ఆరో స్థానంకు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (256) దూసుకొచ్చాడు.
అత్యధిక బౌండరీల జాబితాలో లోకేష్ రాహుల్ (37), మయాంక్ అగర్వాల్ (34), సూర్యకుమార్ యాదవ్ (33) తొలి మూడు స్థానాల్లో నిలవగా.. అత్యధిక సిక్సర్ల జాబితాలో సంజూ శాంసన్ (16), నికోలస్ పూరన్ (16), రాహుల్ తెవాతియా (15) వరుసగా ఉన్నారు. ఆపై ముంబై బ్యాట్స్మెన్లు ఇషాన్ కిషన్ (14), రోహిత్ శర్మ (14), కీరన్ పొలార్డ్ (13).. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (13) ఉన్నారు.
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఢిల్లీ పేసర్ కాగిసో రబాడ ఉన్నాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (11), ట్రెంట్ బౌల్ట్ (11) తర్వాతి స్థానాల్లో సమానంగా నిలిచారు. మరోవైపు హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (10), బెంగళూరు మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (10), పంజాబ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (10) వరుసగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ (9), జేమ్స్ పాటిన్సన్ (9), అన్రిచ్ నోర్జే (8), రవి బిష్ణోయ్ (8) ఉన్నారు.