
హైదరాబాద్: రాష్ట్రంలో యువత చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్లను ఇటీవలే నిషేదించిన జగన్ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 టైటిల్ స్పాన్సర్ అయిన ఫాంటసీ గేమింగ్ ఫ్లాట్ఫాం 'డ్రీమ్11'ను ఏపీలో బ్యాన్ చేసింది. 'డ్రీమ్11' అధికారికంగా బ్యాన్ అయిందని పలు ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రీమ్11ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
అయితే 'డ్రీమ్11' బ్యాన్ అయినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే 'డ్రీమ్11' యూజర్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 'డ్రీమ్11'ను బ్యాన్ చేశారు కదా.. ఐపీఎల్ని కూడా బ్యాన్ చేయండి అని ఒకరు ట్వీట్ చేశారు. 'అయ్యో.. నా డబ్బులు పోతాయా? ఏంటి.. ఇప్పుడు ఎలా?' అని మరొకరు కామెంట్ చేశారు. రమ్మీ లాంటి ఆన్ లైన్ జూద క్రీడలతో చాలామంది డబ్బులు పోగొట్టుకొని, సైబర్ మోసాలకు గురవుతున్న క్రమంలో ఆన్ లైన్ జూద క్రీడలను ఏపీ ప్రభుత్వం నిషేధించింది.

డ్రీమ్ 11, మొబైల్ ప్రీమియర్ లీగ్, మై 11 సర్కిల్, బల్లేబాజీ, మై టీమ్ 11, స్కిల్ ఫర్ ట్యూన్.. పేరు ఏదైతేనేం.. అన్నీ ఊరించి ఊబిలోకి దింపే తరహా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్లే!. మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలది దాదాపు ఒకే శైలి. ముందుగా అవి ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి సభ్యులుగా మారితే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ ఆఫర్లు.. ఆపై ప్రతీ ఆట (మ్యాచ్)కు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. క్రికెట్ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. తమను తాము సదరు క్రీడలో పెద్ద అనుభవజ్ఞులైన విశ్లేషకులుగా భావించి వేసుకుంటున్న అంచనాలతో లెక్క తప్పడం, ఆపై పెద్ద మొత్తంలో నష్టపోవడం తరచుగా జరిగిపోతున్నాయి.
సరిహద్దు వివాదం కారణంగా 'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటంతో.. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్గా ఉండలేమని 'వివో' మొబైల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. బైజుస్ (రూ.201 కోట్లు), అన్అకాడమీ (రూ.170 కోట్లు), డ్రీమ్ 11 (రూ.222 కోట్లు) పోటీపడ్డాయి. చివరికి అత్యధిక మొత్తం వేసిన డ్రీమ్11కే టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కాయి. అయితే ఈ ఒక్క ఏడాదికి మాత్రమే డ్రీమ్11తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది.