
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లోని మిగిలిన మ్యాచ్లకు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తరఫున న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ టిమ్ సీఫర్ట్ ఆడనున్నాడు. కోల్కతా ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్న అమెరికా తొలి క్రికెటర్గా నిలిచిన అలీ ఖాన్ గాయంతో కొద్దిరోజుల క్రితం టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో సీఫర్ట్ (25)ను కోల్కతా ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది.
అమెరికా పేసర్ అలీ ఖాన్ భుజ గాయంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో కొద్దిరోజుల క్రితం అతడు టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 28 ఏళ్ల అలీ ఖాన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలీ ఖాన్తో పాటు టిమ్ సీఫర్ట్ కూడా బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలోని ట్రిన్బాగో జట్టు తరఫున ఆడాడు. గత సెప్టెంబర్లో జరిగిన సీపీఎల్ విజేతగా ట్రిన్బాగో నిలువగా.. సీఫర్ట్ 9 ఇన్నింగ్స్ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. ట్రిన్బాగో, కోల్కతా జట్లకు యజమాని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అన్న విషయం తెలిసిందే.
'టీ20 క్రికెట్లో 40 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అది అతని సత్తాను చాటుతుంది. వెల్కమ్ న్యూజిలాండ్ హిట్టర్ టిమ్ సీఫర్ట్' అని కోల్కతా నైట్ రైడర్స్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. హార్డ్హిట్టర్గా పేరున్న సీఫర్ట్ ఐపీఎల్-13లో ఆడతాడో లేదో చూడాలి. ఎందుకంటే కోల్కతా జట్టులో విదేశీ ఆటగాళ్ల కేటగిరిలో ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లుకీ ఫర్గుసన్, క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్, పాట్ కమిన్స్ ఉన్నారు. అందరినీ దాటుకుని తుది జట్టులో ఆడే అవకాశం రావడం కష్టమే.
కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడి ఐదు విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా కోల్కతాకే ఉన్నాయి. మిగతా ఐదు మ్యాచ్ల్లో మూడింట్లో కనీసం గెలిచినా.. ఆ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. రెండు మ్యాచ్ల్లోనే గెలిస్తే మాత్రం ఇతర జట్ల గణాంకాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పడు రన్రేట్ పరిగణనలోకి వస్తుంది. ఈరోజు బెంగళూరుతో కోల్కతా తలపడనుంది.