
అయితే యూఏఈలో ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తే.. అక్కడికి వచ్చి మ్యాచ్లు ఆడేందుకు కొంత మంది విదేశీ క్రికెటర్లు పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై న్యూజీలాండ్ కెప్టెన్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ స్పందించాడు. యూఏఈలో జరిగే ఈ లీగ్ కోసం పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేసి.. నిర్వహణ ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నాడు. ఐపీఎల్ని సురక్షిత వాతావరణంలో నిర్వహిస్తున్నారని పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతే మ్యాచ్లు ఆడతానని వెల్లడించాడు.
'ఐపీఎల్ అద్భుతమైన లీగ్. అందులో ఆడటం, భాగం కావడం ఎప్పుడూ ఆనందకరమే. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. ఐపీఎల్ను సురక్షితంగా నిర్వహించడం అత్యంత కీలకం. టీ20 ప్రపంచకప్ వాయిదా పడటం సిగ్గుచేటు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం లేదు. ఐపీఎల్ను సురక్షిత ప్రాంతంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని మిగతా క్రీడల మాదిరే క్వారంటైన్ నిబంధనల్ని అమలు చేయొచ్ఛు. అందుకు చాలా ప్రణాళికలు రూపొందించాలి' అని కేన్ విలియమ్సన్ చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్పై ప్రసారదారు స్టార్ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్తో పాటు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. స్టార్ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట. అయితే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తరహాలో బయో సెక్యూర్ బబుల్ని క్రియేట్ చేయడం కష్టమని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు.