
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం 10 రోజుల క్రితమే అబుదాబికి వెళ్లిన ముంబై ఇండియన్స్ ఆదివారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా తమ ఆటగాళ్లకు కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది ముంబై ప్రాంచైజీ. 13వ సీజన్ కోసం ముంబై ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందించింది. ఆదివారం ఆ జెర్సీలనే ధరించి ప్రాక్టీస్ చేశారు. బ్లూ, ఆరెంజ్ రంగుల్లో రూపొందించిన ఆ కొత్త జెర్సీలు ఆటగాళ్లకి మరింత వన్నె తెచ్చాయి.
కొత్త జెర్సీ ఆవిష్కరణను డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఒక పాట రూపంలో విడుదల చేసి.. దాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ఇక అభిమానులెవరైనా ఆ జెర్సీలను కొనాలంటే.. ప్రీఆర్డర్ బుకింగ్ కోసం ఓ లింక్ను కూడా పోస్టు చేసింది. కావాలంటే మీరూ బుక్ చేసుకోవచ్చు అని కాప్షన్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హర్దీక్ పాండ్యా, జస్ప్రీత్ బూమ్రా కొత్త జెర్సీతో ఉన్న చిత్రాలను ముంబై ఇండియన్స్ అధికారిక ట్విట్టర్లో పెట్టింది. చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో అబుదాబిలో కఠిన నిబంధనల ప్రకారం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై, కోల్కతా జట్లు బీసీసీఐని సంప్రదించిచాయి. ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు చేసుకున్న తమకు ప్రాక్టీస్ చేసుకునే అనుమతులు ఇప్పించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను కోరాయి. గవర్నింగ్ కౌన్సిల్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కలిసి స్థానిక అధికారులను సంప్రదించాయి. దీంతో ఆదివారం నుంచి ఆ రెండు జట్లూ ఔట్డోర్లో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఆటగాళ్లు ఆదివారం కొత్త జెర్సీలతో సాధన చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం చెన్నై సూపర్ కింగ్స్ మినహా అన్ని జట్లు సన్నాహాలను ప్రారంభించాయి. ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీజన్ కోసం కఠోరంగా శిక్షణ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల కారణంగా ఎక్కువ మంది భారతీయ ఆటగాళ్లు తమ ఇళ్లకే పరిమితమయిన నేపథ్యంలో తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ముంబై ఆటగాళ్లు మహేళ జయవర్ధనే నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. కిరన్ పొలార్డ్, క్రిస్ లిన్ సహా మరికొందరు విదేశీ ఆగగాళ్లు ఆలస్యంగా జట్టుతో కలువనున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో నాలుగు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై మొదటిసారి 2013లో టైటిల్ను సాధించింది. అనంతరం 2015, 2017, 2019లో టైటిల్ విజేతగా నిలువగా అవతరించింది. ఈ నాలుగు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే సాధించడం విశేషం. ఈ సారి కూడా ట్రోఫీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.