
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు. క్రమంలో ఆదివారం పర్యాటక దినోత్సవ సందర్భంగా.. సచిన్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. గార్డెన్లో విశ్రాంతి తీసుకుంటున్న తన ఫొటోను షేర్ చేశాడు. 'కలల ప్రపంచంలో విహరిస్తున్నా' అని ఆ ఫొటోకి కాప్షన్ పెట్టాడు.
సచిన్ టెండూల్కర్ పోస్టుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సరదాగా కామెంట్ చేశాడు. 'ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టే మరో సారి టైటిల్ గెలుస్తుందని కలలు కంటున్నారా' అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కూడా తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. పనేసర్ పోస్టుపై సచిన్ ఏమని స్పందిస్తాడో చూడాలి. సచిన్ ముంబై జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్తో పాటు సారథిగా జట్టును ముందుండి నడిపించాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచింది. 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్కు రోహిత్ టైటిల్ అందించాడు. అనంతరం 2015, 2017, 2019ల్లో రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై టైటిల్స్ గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు అత్యధిక టైటిల్స్ సాధించిన జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉందంటే.. దానికి కారణం రోహిత్ శర్మనే.
ఐపీఎల్ 13వ సీజన్లోనూ టైటిల్ సాధించాలని రోహిత్ సేన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగింది. అయితే చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఓటమిపాలైంది. తర్వాత మ్యాచ్లో పుంజుకుని కోల్కతాపై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. రోహిత్ శర్మ 80 పరుగులతో రాణించాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన సారథిగా రికార్డు సాధించిన రోహిత్.. ప్రస్తుత సీజన్లోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లీగ్లో భాగంగా బెంగళూరుతో ముంబై సోమవారం తలపడనుంది.