
దుబాయ్: ఈ కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్.. ఎక్కడో ఏడారి దేశంలో సాగుతోంది. కరోనా అంటుకోకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.. అన్నీ తీసుకుంటోంది ఐపీఎల్ మేనేజ్మెంట్. క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రత్యేకంగా బయో సెక్యూర్ బబుల్ వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది. కఠినంగా అమలు చేస్తోంది. ఈ బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించే క్రికెటర్లకు క్వారంటైన్ సెంటర్లే దిక్కు అవుతాయి.
అందుకే- ఎవ్వరూ దాన్ని ఉల్లంఘించాలని అనుకోవట్లేదు. సాధారణ పరిస్థితుల్లోనైతే.. ఐపీఎల్ ఆడే ప్రతి క్రికెటర్ తన కుటుంబ సభ్యులతో కనిపిస్తుంటాడు. భార్యా, పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. స్టేడియంలో వీఐపీ బాక్సుల నుంచి మ్యాచ్ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సారి ఆ పరిస్థితులు లేవు. స్టేడియంలో అడుగు పెట్టే వీలు ఉండట్లేదు. ఫ్రాంఛైజీలు, టీమ్ సపోర్టింగ్ స్టాప్ తప్ప మరొకరిని స్టేడియంలోకి అనుమతించట్లేదు ఐపీఎల్ మేనేజ్మెంట్.

క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఐపీఎల్ సాగుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. దీని ఎఫెక్ట్.. క్రికెటర్ల భార్యలపై కాస్త భారీగానే పడుతోంది. నెలన్నర రోజుల పాటు భర్తలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. అందుకే- పాత జ్ఙాపకాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ పార్టీ పిక్.. వైరల్గా మారింది.
మిస్సింగ్ మై గ్యాంగ్ అనే ట్యాగ్ను దానికి యాడ్ చేశారామె. భర్త హార్దిక్ పాండ్యా, మరిది కృనాల్ పాండ్యా, అతని భార్య, వారి ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫొటో అది. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఐపీఎల్లో ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ టీమ్ మెంబర్ అతను. ఎమిరేట్స్లో ఉంటోన్న హార్దిక్ పాండ్యా.. ఇదివరకు దిగిన ఓ బీచ్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బీచ్ వైబ్ లుక్లో ఉన్న ఫొటో అది దీనికి నటాషా స్పందించారు. ఊ లల్లా అంటూ రిప్లయ్ ఇచ్చారు. మిస్సింగ్ మై గ్యాంగ్ అంటూ తన పార్టీ పిక్ను పోస్ట్ చేశారు.