
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి 7.30గంటలకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రోహిత్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు రాజస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కార్తీక్ త్యాగి ఐపీఎల్ ఆరంగేట్రం చేస్తున్నాడు. యశశ్వీ జైశ్వాల్, అంకిత్ రాజపూత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫామ్లో లేని రాజస్తాన్ ఆటగాళ్లు జయ్దేవ్ ఉనాద్కట్, రాబిన్ ఊతప్పలకు చోటు దక్కలేదు.
తొలి రెండు మ్యాచ్ల్లో సంచలన విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓడి ఢిలా పడింది. ఈ మ్యాచ్లో ఎలాగైన గెలిచి విజయాల ట్రాక్లో పడాలని భావిస్తోంది. మరోవైపు భీకరమైన బ్యాటింగ్ లైనప్తో విజయ ఉత్సాహంలో ఉన్న ముంబై తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఐదింటిలో మూడు విజయాలతో ముంబై టేబుల్లో టాప్-2లో ఉండగా.. రెండింటిలో గెలిచి మరో రెండింటిలో ఓడిన రాజస్థాన్ ఐదో స్థానంలో ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 11-11తో సమంగా ఉన్నాయి. ఒక్క మ్యాచ్లో ఫలితం తేలలేదు. అయితే ఇటీవల రికార్డులు పరిశీలిస్తే.. ముంబైపై రాజస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చివరగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో రాజస్థాన్దే గెలుపు. ఒక మ్యాచ్లో మాత్రమే ముంబై విజయం సాధించింది. అబుదాబి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ అనుకూలంగా ఉండనుంది.
తుది జట్లు:
ముంబై: రోహిత్శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
రాజస్థాన్: జోస్ బట్లర్, యశశ్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, టామ్ కరన్, రాహుల్ తెవాటియా, జొఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజపూత్, కార్తీక్ త్యాగి.