
దుబాయ్: ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనె అన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రెండు రోజుల క్రితం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబై 6 మ్యాచులు ఆడగా.. నాలుగు గెలిచి రెండు ఓడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 8 పాయింట్లతో ముంబై టేబుల్ టాపర్గా ఉంది.
తాజాగా మహేళ జయవర్దనె మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. 'ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత నిలకడగా క్రికెట్ ఆడుతోంది. బ్యాటు, బంతితో నైపుణ్యాలను చక్కగా అమలు చేస్తున్నాం. అంతా సవ్యంగానే సాగుతుంది. ముంబై వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. మేమింకా మెరుగుపడాల్సిన విభాగాలు ఉన్నాయి. అందుకే మేం వాటిపై రోజూ దృష్టి పెట్టాల్సిందే' అని జయవర్దనె అన్నాడు. అయితే ఏయే విభాగాల్లో మెరుగవ్వాలో మాత్రం అతడు చెప్పలేదు.
రాజస్థాన్పై 57 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్పై మహేళ జయవర్దనె మాట్లాడాడు. 'మా వద్ద కొన్ని ప్రణాళికలున్నాయి. ఆ మ్యాచ్కు సంబంధించి భిన్నమైన వ్యూహాలు అమలు చేశాం. బుమ్రాతో ముందుగా బౌలింగ్ చేయించాం. వికెట్పై మూవ్మెంట్ కనిపించడంతో విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం' అని ఆయన పేర్కొన్నాడు. బౌల్ట్, బుమ్రా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశారని జయవర్దనె ప్రశంసించాడు. ప్యాటిన్సన్ సైతం మంచి లెంగ్తుల్లో బంతులు విసిరాడని పేర్కొన్నాడు. స్పిన్నర్లూ మెరుగ్గా రాణించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఎంత బాగా ఆడగలడో తనకు తెలుసని పేర్కొన్నాడు.
మంగళవారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ శర్మ (35; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు)లు రాణించచారు. అనంతరం రాజస్తాన్ను 18.1 ఓవర్లలో 136 ఆలౌట్ చేసి మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. జోస్ బట్లర్ (70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) మినహా ఎవరూ రాణించలేదు.