
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది. భారీ షాట్లకు పోయి స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ కాగా.. స్టార్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ డకౌట్ అయ్యాడు. అయితే ఓపెనర్ క్వింటన్ డీకాక్ (40; 25 బంతుల్లో 5×4, 1×6), సూర్యకుమార్ యాదవ్ (51; 38 బంతుల్లో 6×4, 2×6) మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరారు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో ముంబై ఒత్తిడిలో పడింది. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ను నిర్మించే పనిలో పడ్డారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ను కట్టడి చేసేందుకు అశ్విన్ను పవర్ప్లేలో బౌలింగ్కు దించాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అనూహ్యంగా రోహిత్ డకౌట్ కావడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. వికెట్ పడినా డికాక్ మాత్రం తన జోరు కొనసాగించాడు.
డికాక్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్.. డికాక్కు మంచి సహకారం అందించాడు. ఇద్దరూ చెలరేగడంతో ముంబై స్కోరు తగ్గలేదు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ధాటిగా ఆడే క్రమంలో డికాక్ ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ భారీ షాట్లు ఆడుతూ అర్ధ శతకంతో చేశాడు. నోర్జ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి ఫోర్ బాదిన సూర్యకుమార్ 36 బంతుల్లోనే హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడి ఔటయ్యాడు.
ముంబై ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న సమయంలో అన్రిచ్ నోర్జ్ .. సూర్య కుమార్ను పెవిలియన్కు పంపి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ డకౌటయ్యాడు. ఆర్ అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై కష్టాలో పడింది. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ భారీ షాట్లు ఆడుతున్నాడు.15 ఓవర్లకు ముంబై 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (22), కృనాల్ పాండ్య (6) క్రీజులో ఉన్నారు.