
టాప్-3 బ్యాట్స్మెన్ డకౌట్:
201 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఓటమి దాదాపు ఖరారైంది. ముంబై స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో.. ఢిల్లీ టాప్-3 బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యారు. పృథ్వీ షా (0), శిఖర్ ధావన్ (0), అజింక్య రహానె (0) డకౌటయ్యారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టు స్కోర్ సున్నా పరుగులకే ముగ్గురు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడం ఇదే ప్రథమం. మూడు ఫోర్లు కొట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 (8బంతుల్లో) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో ఢిల్లీ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

స్టోయినిస్ రాణించినా:
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మార్కస్ స్టోయినిస్ మాత్రం భారీ షాట్లు ఆడాడు. మరోవైపు రిషబ్ పంత్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓటమి దిశగా సాగింది. అయితే స్టోయినిస్ పట్టువిడవకుండా ఆడాడు. అతనికి అక్షర్ పటేల్ మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడిన స్టోయినిస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. ఆపై పటేల్ రాణించినా ఢిల్లీ పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కేవలం 143 పరుగులు చేయగలిగింది.

హార్డిక్ మెరుపులు:
అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ (51: 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), ఇషాన్ కిషన్ (55 నాటౌట్: 30 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ శతకాలకు తోడు క్వింటన్ డికాక్ (40: 25 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్), హార్డిక్ పాండ్యా (37 నాటౌట్: 14 బంతుల్లో 5సిక్సర్లు) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అన్రిచ్ నోర్జ్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీశారు.

రికార్డులు:
* లీగ్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ముంబై పేస్ బౌలర్ బౌల్ట్ (14 వికెట్లు) నిలిచాడు.
* ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌటైన ఆటగాడిగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
* ముంబై మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిన ప్రతిసారి గెలిచింది. ఇప్పటి వరకూ 11 మ్యాచుల్లో గెలిచింది.
* సున్నా పరుగులకే ముగ్గురు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడం ఇదే తొలిసారి.
* ఈ మ్యాచులో నలుగురు టీమిండియా ఓపెనర్లు (రోహిత్ శర్మ, పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె) డకౌట్ అయ్యారు.


Click it and Unblock the Notifications












