
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆదివారం రాత్రి అబుదాబి వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. క్వింటన్ డికాక్ (53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో.. ముంబై 163 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండానే ఛేదించింది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ సహా ఫీల్డింగ్లోనూ నిరాశపరిచిన ఢిల్లీ ఈ సీజన్లో రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో ఓ అనవసరపు రికార్డును ఢిల్లీ తన ఖాతాలో వేసుకుంది.
ఆదివారం ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ అవసరం లేని రికార్డును తన పేరిట లిఖించుకుంది. శ్రేయస్ అయ్యర్ సేన ఐపీఎల్ టోర్నీలో 100 మ్యాచ్లు ఓడిపోయిన రెండో జట్టుగా అవతరించింది. శనివారం కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ లీగ్ చరిత్రలో 100 మ్యాచ్లు ఓడిపోయిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. తాజాగా ఢిల్లీ ఆ చెత్త రికార్డును అందుకుంది.
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ తొలుత హైదరాబాద్ చేతిలో ఓటమిపాలవ్వగా.. తర్వాత ఆదివారం ముంబై చేతిలో ఓటమిని ఎదుర్కొంది. దీంతో ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 ఓటములతో 10 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబైతో సమానంగా 10 పాయింట్లు సాధించినా రన్రేట్ పరంగా రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఇప్పటివరకు టోర్నీలో ఫైనల్ చేరలేని సంగతి తెలిసిందే. 2009, 2012, 2019 సీజన్లలో ప్లేఆఫ్స్కు చేరినా.. మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈసారి టైటిల్ గెలుస్తుందో లేదో వేచిచూడాలి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రోహిత్ సేన 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలు సాధించారు.