
హైదరాబాద్: మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఈసారి యుఎఇలో ఐపీఎల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్ 2020 మ్యాచ్లు శనివారం ప్రారంభం కానున్నాయి. లీగ్ సంప్రదాయం ప్రకారం గతేడాది ఛాంపియన్, రన్నరప్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అబుదాబి విదేకగా సెప్టెంబర్ 19న జరిగే లీగ్ ఆరంభ మ్యాచ్లో రన్నరప్ చెన్నై సూపర్కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైమింగ్స్, ప్రత్యక్ష ప్రసార వివరాలు ఓసారి తెలుసుకుందామా?!!.
యూఏఈ కాలమానం ప్రకారం ముంబై-చెన్నై మ్యాచ్ శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. అదే భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు స్టార్ అవుతుంది. ఇక టాస్ 7 గంటలకే పడనుంది. భారత్ సమయం యూఏఈ కంటే దాదాపు ఒక గంట 30 నిముషాలు ముందుగా ఉంటుంది. ఇక మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానెన్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అభిమానుల కోసం తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషల్లో కామెంట్రీని అందుబాటులో ఉంచింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం.
వారాంతపు రోజుల్లో (శనివారం, ఆదివారం) రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు స్టార్ అవుతుంది. ఇక రెండో మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (దుబాయ్), షార్జా క్రికెట్ స్టేడియం (షార్జా), షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి) మైదానాల్లో అన్ని మ్యాచ్లు జరగనున్నాయి.
ఐపీఎల్ అనగానే బోల్డంత గ్లామర్, ఫ్యాన్స్ హంగామా, చీర్ గాళ్స్ చిందులు.. ఇలా జోష్ కళ్లముందు కదలాడుతుంది. కానీ కరోనా వైరస్ ఐపీఎల్ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ ప్రారంభం వేడుకకు కూడా నోచుకోవడం లేదు. చీర్ గాళ్స్, ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ డోర్స్ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా టీవీ ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, మున్ముందు మాత్రం 30 శాతం మంది స్టేడియంలో సామాజిక దూరం పాటిస్తూ కనిపిస్తారని సమాచారం.