
అబుదాబి: క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో మరో డబుల్ హెడర్ సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో జరిగే ఫస్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్కతా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి స్థానంలో ప్రసీద్ క్రిష్ణ టీమ్లోకి వచ్చాడు. మరోవైపు పంజాబ్ కూడా ఒక మార్పు చేసింది. షెల్డన్ కాట్రెల్ స్థానంలో క్రిస్ జోర్డాన్ తుది జట్టులోకి వచ్చాడు. విండీస్ బిగ్ హిట్టర్ క్రిస్ గేల్కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ కూడా అతడు ఆడడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్ 2020లో ఐదు మ్యాచ్లాడిన కోల్కతా నైట్రైడర్స్ మూడింట్లో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్లాడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధింది పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. ఇక ఆడబోయే 8 మ్యాచ్ల్లో కనీసం ఏడింట్లో గెలుపొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఆ ఆజట్టుకు ఎంతో కీలకం.
ఐపీఎల్ చరిత్రలో కోల్కతా, పంజాబ్ జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా.. 17-8తో కేకేఆర్ లీడ్లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని కేకేఆర్ భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. 2014లో ఇరు జట్ల మధ్య అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో చూడాలి.
తుది జట్లు:
పంజాబ్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, మన్దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, ముజీబ్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ.
కోల్కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, ఇయన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్కోటి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.