
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు షేన్ వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదరగొట్టడంతో ధోనీసేన 17.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత విక్టరీ కొట్టడంతో చెన్నై జట్టులో ఆనందం వెల్లువిరిసింది.
ఈ మ్యాచ్ అనంతరం యూనివర్సల్ బాస్, పంజాబ్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిశాడు. గేమ్ ఆఫ్ ద స్పిరిట్లో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరి నొకరు అభినందించుకున్నారు. ఈ క్రమంలో గేల్తో ధోనీ సరదాగా ముచ్చటించాడు. అయితే గేల్ను కలిసే ముందు ధోనీ ఫన్నీగా నడిచాడు. గేల్ను మహీ అనుకరించాడు. అచ్చం యూనివర్సల్ బాస్లా నడిచి నవ్వులు పూయించాడు.
క్రిస్ గేల్ ఎలా నడుస్తాడో దాన్ని అతనే ఎదుటే ఎంఎస్ ధోనీ చేసి నవ్వులు పూయించాడు. దీనికి గేల్ కూడా నవ్వుకుంటా వచ్చి మహీతో కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు విష్ చేసుకుని తర్వాత మ్యాచ్ విశేషాలను షేర్ చేసుకున్నారు. ధోనీని చూసిన అక్కడున్న ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. గేల్ను అనుకరిస్తూ మహీ నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను 'ధోనీ గిఫ్ట్స్' అనే ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకూ క్రిస్ గేల్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. పంజాబ్ ఓపెనర్లగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్లు రాణిస్తుండడంతో గేల్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే వరుసగా పంజాబ్ ఓడిపోవడం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. మిడిల్ఆర్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ విఫలం కావడంతో పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకుంటుంది. దీంతో మ్యాక్స్వెల్ స్థానంలో గేల్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాహుల్కు జతగా గేల్ ఓపెనర్గా రానున్నాడు. ఇక మయాంక్ ఫస్ట్ డౌన్లో వస్తాడు.