
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచులు వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 60 మ్యాచ్లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికల్లో జరుగనున్నాయి. కొవిడ్-19 వైరస్ కోరలు చాస్తుండటంతో.. లీగ్ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇక ఐపీఎల్ టోర్నీ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్కు చేరుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ఆరు రోజుల క్వారంటైన్ ముగిసింది.
తాజాగా పంజాబ్, రాజస్థాన్ ఆటగాళ్లకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని తెలిసింది. బీసీసీఐ నిబంధన ప్రకారం జట్లు దుబాయ్ చేరుకున్నాక.. 1, 3, 6 రోజుల్లో ఆటగాళ్లకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేశారు. ఇక క్వారంటైన్లో ఆటగాళ్లను వారి గదుల నుంచి బయటకు కూడా రానీయలేదు. యూఏఈలో ఉదయం ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి సాయంత్రమే అన్ని జట్లు సాధన చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. గత గురువారం పంజాబ్, రాజస్థాన్ దుబాయ్ చేరుకుని.. బస సైతం అక్కడే ఏర్పాటు చేసుకున్నాయి.
గత గురువారమే అబుదాబి చేరుకున్న కోల్కతా నైట్ రైడర్స్ క్వారంటైన్ కూడా ఈరోజుతోనే ముగిసింది. ఇక చెన్నై సూపర్కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ గత శుక్రవారం అక్కడికి చేరుకున్నాయి. వారి క్వారంటైన్ గురువారంతో ముగుస్తుంది. ఆదివారం చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వారంటైన్.. శనివారంతో ముగియనుంది. అన్ని జట్ల క్వారంటైన్ ముగిసిన తర్వాత అసలు సిసలైన సందడి మొదలవ్వనుంది.
యూఏఈలో జరిగే ఐపీఎల్ 2020 టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే అబుదాబిలో ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనల వల్లే.. మ్యాచ్ షెడ్యూల్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా అర్థమవుతున్నది. దుబాయ్, షార్జాలతో పోలిస్తే.. అబుదాబిలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మ్యాచ్లు నిర్వహించాలా వద్దా అన్న ఆలోచనల్లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈవారం చివర లోగా ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.