
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా బుధవారం రాత్రి 39వ మ్యాచ్కు అబుదాబి వేదిక కానుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్కి అడుగు దూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ ఒక సిక్స్ బాదితే.. ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటి వరకూ నలుగురు క్రికెటర్లు మాత్రమే 200లకుపైగా సిక్సర్లు బాదారు.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 199 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో ఒక సిక్స్ బాదితే.. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోకి చేరనున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 335 సిక్సర్లు బాదాడు. బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (231), చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (215), ముంబై సారథి రోహిత్ శర్మ (209) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభం అయింది. మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 186 మ్యాచ్లు ఆడాడు. 131.36 స్ట్రైక్రేట్తో 5,759 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 498 ఫోర్లు,199 సిక్సర్లు బాదాడు కోహ్లీ.
విరాట్ కోహ్లీ తాజాగా టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్మెన్గా నిలిచాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో ఒకే జట్టుకు అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ తాజా సీజన్లో 9 మ్యాచ్లాడిన బెంగళూరు ఆరు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. మిగిలిన ఐదు మ్యాచ్లలో కనీసం రెండింటిలో గెలవాలి.