అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న 39వ మ్యాచ్కు అబుదాబి వేదిక కానుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మోర్గాన్ రెండు మార్పులు చేశాడు. టామ్ బాంటన్, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కోహ్లీసేన ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.
ఇప్పటి వరకూ రెండు జట్లు చేరో తొమ్మిది మ్యాచ్లాడాయి. అందులో ఆరు విజయాలతో బెంగళూరు ఒకడుగు ముందు ఉండగా.. కోల్కతా ఐదు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. గత మ్యాచుల్లో సాధించిన విజయాలతో రెండు జట్లూ మంచి జోరులో ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 విజయాలతో కోల్కతా పైచేయి సాధించింది. బెంగళూరు 11 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో మాత్రం కోల్కతాను బెంగళూరు 82 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ రెండు జట్లూ ఆడిన గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో గెలిచి, రెండింట్లో ఓడాయి. అబుదాబి మైదానంలో 9మ్యాచ్లాడిన కోల్కతా ఐదింట్లో గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఇక్కడ రెండు మ్యాచ్లాడిన బెంగళూరు రెండింట్లోనూ విజయాలను అందుకుంది.
తుది జట్లు:
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, గురుకీరత్సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్.
కోల్కతా: శుభ్మన్ గిల్, టామ్ బాంటన్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తిక్, రాహుల్ త్రిపాఠి, లూకి ఫెర్గూసన్, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ.