
అబుదాబి: బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో తమ బ్యాట్స్మెన్ భయపడ్డారని కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అన్నాడు. అబుదాబి పిచ్ బ్యాట్స్మెన్కు ప్రతికూలంగా ఏం లేదని, ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ బాగుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. బెంగళూరు మ్యాచ్లో ఓడినా తమకు ఇంకా ప్లేఆఫ్ అవకాశాలున్నాయని, ప్లేఆఫ్స్ చేరతామని మెక్కల్లమ్ ధీమా వ్యక్తం చేశాడు. గత రాత్రి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ దెబ్బకు ఇయాన్ మోర్గాన్ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు.
తాజాగా బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ... 'అబుదాబి పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందనుకోవట్లేదు. ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మంచి లైన్లో బంతులు విసురుతూ బ్యాట్స్మెన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. క్రిస్ మోరిస్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. వాళ్లు బౌలింగ్ బాగా చేయడంతో పాటు మా బ్యాట్స్మెన్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. మ్యాచ్ ఓడినా ఇప్పటికీ కోల్కతా నాలుగో స్థానంలోనే ఉంది. ఇది మా అదృష్టం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం' అని అన్నాడు.
కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... 'టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే మేం చేసిన మొదటి తప్పు. లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. ఇన్నింగ్స్ ఆరంభంలోనే 4-5 వికెట్లు కోల్పోయినప్పుడే మ్యాచ్ మా చేతుల్లోంచి చేజారిపోయిందని అర్థమైంది. బెంగళూరు బౌలర్లు బాగా బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్ మాకు ఒక గుణపాఠం నేర్పింది. జట్టులో భారత యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం.సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఫామ్ అందుకుంటారని ఆశిస్తున్నాం. త్వరలోనే వాళ్లు జట్టులోకి వస్తారని భావిస్తున్నాం' అని తెలిపాడు.
టాస్ గెలిచిన కోల్కతా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే బెంగళూరు పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేసర్ మహ్మద్ సిరాజ్ విజృంభించి మూడు కీలక వికెట్లు పడగొట్టి కోల్కతాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేశాడు. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, టామ్ బాంటన్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 4-2-8-3.. ఇవి మహ్మద్ సిరాజ్ గణాంకాలు. మిగతా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా కేవలం 84 పరుగులకే పరిమితమైంది. చిన్న లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాట్స్మెన్ను కోల్కతా బౌలర్లు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.