బబుల్ రూల్స్ ప్రకారం:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్లో కరుణ్ నాయర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున మ్యాచ్లు ఆడనున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ పూర్తిగా బయో బాబుల్ వాతావరణంలో జరగనుంది. బబుల్ రూల్స్ ప్రకారం క్రికెటర్లకి వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని టీమ్స్ ఫ్రాంఛైజీలకి.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది.
రెండు వారాల క్రితమే:
ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు వైరస్ పరీక్షలు చేస్తుండగా.. కరుణ్ నాయర్కి రెండు వారాల క్రితమే వైరస్ సోకినట్లు మెడికల్ రిపోర్ట్ల ద్వారా తేలింది. అయితే తాజాగా నాయర్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ వచ్చినట్లు ఓ స్పోర్ట్స్ ఛానెల్ తెలిపింది. కరోనా నెగటివ్ రావడంతో ఐపీఎల్ 2020 సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో నాయర్ త్వరలోనే చేరేందుకు మార్గం సుగుమమైంది. ఓ భారత క్రికెటర్కి కరోనా వైరస్ సోకడమంటే పెద్ద విషయం. కానీ ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. నాయర్తో పాటు కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఏసీ) కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.
టెస్టులో ట్రిపుల్ సెంచరీ:
చెన్నై వేదికగా 2016లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. తద్వార టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ చరిత్ర సృష్టించాడు. నాయర్ జింబాబ్వే జట్టుపై హరారే స్పోర్ట్స్ క్లబ్లో 11 జూన్ 2016న జరిగిన మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేశాడు. 26 నవంబరు 2016న మొహాలీలో ఇంగ్లాండ్పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరుపున రెండు వన్డేలాడిన నాయర్ 46 పరుగులు చేశాడు. 6 టెస్ట్ మ్యాచులో 374 రన్స్ చేశాడు.
కర్ణాటక జట్టులో కీలక ఆటగాడు:
కరుణ్ నాయర్ ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 77 మ్యాచ్లాడి 49.5 యావరేజితో 5446 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున మ్యాచ్లు ఆడనున్నాడు. 69 ఐపీఎల్ మ్యాచులలో 1464 పరుగులు చేశాడు.