పిల్లల కోసం.. ఐపీఎల్ వదిలేశా:
'నా పిల్లలకు సెలవులు ఉండడంతో ఐపీఎల్ 2020 వదిలేసి ఇంటికి (లండన్) వెళ్తున్నా. బాధగానే ఉన్నా.. తప్పడం లేదు. ఇకపై పిల్లలతో కలిసి ఇంట్లోనే సరదాగా ఉండాలనుకుంటున్నా. ఇదో వింత ఏడాది. ఇప్పుడు పిల్లలకు పాఠశాల కూడా లేదు. కాబట్టి ప్రతిరోజు వాళ్లతోనే సమయం గడపాలని కోరుకుంటున్నా. ఇలాంటి సమయం మళ్లీ వస్తుందో లేదో తెలియదు. అందుకే నిర్ణయం తీసుకున్నా' అని కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు దుబాయ్ నుంచి లండన్ వరకూ సాగిన తన ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోనూ కూడా పోస్టు చేశాడు.
ఐపీఎల్లో సెంచరీ:
2007లో వివాహం చేసుకున్న కెవిన్ పీటర్సన్, జెస్సికా టేలర్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు రోసీ పీటర్సన్, డైలాన్ పీటర్సన్. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచే ఈ సీజన్లో వ్యాఖ్యాతగా పీటర్సన్కు చివరిది. 40 ఏళ్ల పీటర్సన్.. వ్యాఖ్యానం చేయకముందు ఐపీఎల్ టోర్నీలో ఆడిన విషయం తెలిసిందే. నాలుగు వేర్వేరు ఐపీఎల్ జట్ల కోసం ప్రాతినిధ్యం వహించాడు. 2009 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ పీటర్సన్ను రూ. 9.8 కోట్లకు దక్కించుకుంది. 36 ఐపీఎల్ మ్యాచులలో 1001 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
136 వన్డేల్లో 4,440 పరుగులు:
2013-14 యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.