ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే..?
ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా గురువారం సాయంత్రం జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొట్టబోతోంది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు జట్లూ తలపడబోతున్నాయి. ఈ రెండింటికీ ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. జీవన్మరణ సమస్యగా తయారైంది. ఏ జట్టు ఓడిపోయినా.. ప్లేఆఫ్ ఆశలకు దూరమౌతుంది.
అట్టడుగు జట్ల మధ్య ఫైట్..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కూడా చివరి స్థానాల్లో నిల్చున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్తో పోల్చుకుంటే రాజస్థాన్ టీమ్ పరిస్థితి కొంతలో కొంత మెరుగు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో రాజస్థాన్ జట్టు ఆరో స్థానంలో ఉంది. హైదరాబాద్ టీమ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్లో పది మ్యాచ్లను ఆడిన రాజస్థాన్ జట్టు నాలుగు విజయాలను సాధించింది. ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
భారీ నెట్ రన్రేట్..
తొమ్మిది మ్యాచ్లను ఆడిన హైదరాబాద్.. ఆరు మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. రాజస్థాన్ టీమ్.. చివరి అయిదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచింది. చివరి అయిదు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకూ కీలకమైనదే హైదరాబాద్ గెలిస్తే.. ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానం నుంచి పైకి ఎగబాకడం ఖాయం అవుతుంది. భారీ తేడాతో గనక విజయాన్ని అందుకోగలిగితే..పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజస్థాన్ పరిస్థితీ దాదాపుగా అంతే.
కేన్ ఆడతాడా?
ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ ఆడతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోల్కత నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అతను గాయపడ్డాడు. హేమ్స్ట్రింగ్ గాయంతో అతను బాధపడుతున్నాడు. గాయంతోనే అతను ఆ మ్యాచ్లో ఆడాడు. ఈ గాయం నయమైందనే సంకేతాలను ఇస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్. కేన్ విలియమ్సన్ నెట్లో ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తోన్న కొన్ని ఫొటోలను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్లో మహ్మద్ నబీని ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.