
స్మిత్ సేన పరిస్థితి ఎలా ఉందంటే..
ఐపీఎల్-2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా ఉండట్లేదు. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్లను ఆడిన ఆ జట్టు మూడింట్లో నెగ్గగలిగింది. గెలిచే మ్యాచ్లను సైతం చేతులారా పోగొట్టుకుంటోంది. బుధవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఏ మాత్రం ధాటిగా ఆడి ఉన్నా రాజస్థాన్.. రాయల్గా విజయం సాధించి ఉండేది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. నిర్లక్ష్యపు ఆటతీరుతో ఓటమిని కొనితెచ్చుకుంటోంది.

ఇక ఆరు మ్యాచ్లే
రాజస్థాన్ రాయల్స్.. వచ్చే మూడు మ్యాచ్లు కఠినమైనవే. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బేరీజు వేసుకుంటే.. బెంగళూరు టీమ్ బలంగా ఉంటోంది. దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. క్రిస్ మోరిస్, మొయిన్ అలీ వంటి ఆల్రౌండర్లు, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, నవదీప్ షైనీ వంటి బౌలర్లతో నిండి ఉంది. దీన్ని ఢీ కొట్టి ముందుకెళ్లాల్సి ఉంది స్మిత్ సేనకు. 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, 22న సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడాల్సి ఉంది. ఈ మూడుకు మూడూ గెలవాల్సిన పరిస్థితిలో ఉంది రాజస్థాన్.

చివరి మూడింట్లో..
రాజస్థాన్ రాయల్స్.. తన చివరి మూడు మ్యాచ్లల్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్కత నైట్ రైడర్స్తో ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచుల్లో తొలి మూడింట్లో గెలిస్తే.. ప్లేఆఫ్ చేరడానికి కొద్దిగానైనా అవకాశాలు ఉంటాయి. లేదంటే ముంబై ఇండియన్స్, కోల్కత నైట్ రైడర్స్పై భారీ నెట్ రన్రేట్తో విజయాన్ని సాధించి ప్లే ఆఫ్లో చేరాలంటే అద్బుతం జరగాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యమేననిపిస్తోంది. పోరాడితే పోయేది లేదనే కమ్యూనిస్టుల సిద్ధాంతంతో ఆడితే తప్ప రాజస్థాన్ రాయల్స్ .. ప్లే ఆఫ్లో అడుగు పెట్టలేకపోవచ్చు.


Click it and Unblock the Notifications












