
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భారత్లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో.. లీగ్ను దుబాయ్లో నిర్వహించాలని ముందే నిర్ణయించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్.. నవంబర్ 10 వరకు 53 రోజుల పాటు సాగనుంది. ఇక ఐపీఎల్ కోసం ఆగస్టు 20వ తేదీలోగా ఆటగాళ్లు, సిబ్బందిని ఫ్రాంచైజీలు యూఏఈకి తీసుకెళ్లనున్నాయి.
ఆగస్టు రెండో వారంలోనే వెళ్లాలని మొదటగా జట్టు యాజమాన్యాలు ఆలోచించాయి. అయితే ప్రయాణాన్ని వారం పాటు ఆలస్యం చేసుకోవాలని ఐపీఎల్ పాలక మండలి సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రొటోకాల్స్ పాటించి, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు సమయం పడుతుందని భావించిన సీజీ.. ఫ్రాంచైజీలకు సూచనలు చేసింది. ముఖ్యంగా యూఏఈకి వెళ్లే ముందు ఆటగాళ్లకు వైరస్ పరీక్షలు చేసేందుకు సమయం పట్టనుందని సమాచారం.
యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా ఈ ఏడాది టోర్నీ జరుగనుంది. కాగా కరోనా వైరస్ ప్రభావం ఏ మాత్రం పడకుండా లేకుండా ఐపీఎల్ కోసం బీసీసీఐ బయో సెక్యూర్ వాతావరణాన్ని సృష్టించనుంది. ఐపీఎల్ కోసం వెళ్లేవారంతా వెళ్లిన రోజు నుంచే బయోబబుల్లో ఉండనున్నారు. కాగా ఒక్కో ఫ్రాంచైజీ తరఫున గరిష్ఠంగా 24మంది ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది.
ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది .చైనా మొబైల్ కంపెనీ వివో స్పాన్సర్షిప్ కొనసాగించడం ఐపీఎల్ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయంలో ముఖ్యమైనది. జూన్ నెలలో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల అనంతరం భారత ప్రభుత్వం చైనా కంపెనీలకు చెందిన పలు యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వివో స్పాన్సర్షిప్ కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్కు మాత్రం చైనా స్పాన్సర్ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ధ్వజమెత్తారు. 'చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్ఫోన్ ఉత్పత్తిదారులను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే.. ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు' అని ట్విటర్లో విమర్శించారు.