ఎన్నో మధుర స్మృతులు:
ఐపీఎల్ 2020 ప్రారంభమవుతుండడంతో తమ అభిమాన క్రీడాకారులను టీవీలోనైనా చూడొచ్చని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆతిథ్య ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రం మైదానంకు వెళ్లి మ్యాచ్లు చూసే అవకాశం తమ క్రికెట్ అభిమానులకు ఇవ్వాలనే చూస్తోంది. తమ దేశంలో కరోనా అదుపులోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. స్టేడియంలోని సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. ఏదేమైనా గత 12 సీజన్లుగా అభిమానులకు ఐపీఎల్ ఎన్నో మధుర స్మృతులను ఇచ్చింది. అయితే మైఖేల్ కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులకు కోసం పంచుకుంది.
అత్యంత ఖరీదైన లీగ్:
ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. అభిమానుల నుంచి చూసుకున్నా ఇదే వెల్లడయింది. ఐపీఎల్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి జట్లకు సొంత అభిమానులు భారీ స్థాయిలో ఉంటారు. సొంత మైదానంలో మ్యాచ్ అంటే చూడడానికి ఎగబడతారు. ఒక్కోసారి టికెట్లు దొరక్క చాలామంది ఫాన్స్ నిరాశకుగురవుతారు. అయితే హోమ్ గ్రౌండ్ మ్యాచ్లను ఓ అభిమాని చూడాలనుకుంటే.. అతడు/ఆమె తన వార్షిక జీతంలో 0.9 శాతం ఖర్చు చేయాల్సిఉంటుందని ఓ ఆన్లైన్ సర్వే తెలిపింది. అదే బెంగళూరు జట్టు అన్ని హోమ్ మ్యాచ్లను ఓ అభిమాని చూడాలనుకుంటే.. అతడు/ఆమె తన వార్షిక జీతంలో 2.2% ఖర్చు చేయాల్సిఉంటుంది. ఇక కోల్కతా అభిమానికి తక్కువ ఖర్చవుతుందని వెల్లడైంది.
భారత్ నుంచి ఇద్దరు మాత్రమే:
ఐపీఎల్ 12 సీజన్లలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 'అత్యంత విలువైన ఆటగాడు' అవార్డును దక్కించుకున్నారు. 2010లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సచిన్ టెండూల్కర్ (618) ఈ అవార్డును గెలుచుకోగా.. 2016 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ముగ్గురు ఆటగాళ్లు మాత్రేమే ఈ అవార్డును రెండుసార్లు గెలుచుకున్నారు. ఈ జాబితాలో షేన్ వాట్సన్ (2008, 2013 రాజస్థాన్ రాయల్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్ రైడర్స్ 2015, 2019), సునీల్ నరైన్ (కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2018) ఉన్నారు.
ఏకైక ఆటగాడు కోహ్లీ:
ఐపీఎల్లో మూడు డబుల్ సెంచరీ భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్పై కోహ్లీ, క్రిస్ గేల్ కలిసి 204 పరుగులు చేసారు. 2015లో ఏబీ డివిలియర్స్తో కలిసి కోహ్లీ ముంబై ఇండియన్స్పై 215 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 2016లో గుజరాత్ లయన్స్పై ఏబీ-కోహ్లీ 229 పరుగులు బాదారు. ఇక వికెట్ కీపర్లుగా సంగక్కర, ఏబీ కొన్ని ప్రత్యేకమైన రికార్డులు నెలకొల్పారు. ఒక ఇన్నింగ్స్లో ఐదుగురిని సంగా పెవిలియన్ చేర్చగా.. 2016లో ఏబీ 19 క్యాచులు అందుకున్నాడు.