
దుబాయ్: భారత్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) యూఏఈలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆటగాళ్ల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బీసీసీఐ ఈ మెగా టోర్నీని నిర్వహిస్తోంది. ఆటగాళ్లు వైరస్ బారిన పడకుండా బయో బబుల్ను సృష్టించింది. ప్లేయర్స్, సహాయ సిబ్బంది, ప్రాంచైజీ యజమానులు అందరూ క్వారంటైన్, కరోనా టెస్టుల అనంతరం బయో బబుల్లోకి ప్రవేశించారు. అయితే ప్లేయర్స్ కొందరు బుడగ దాటుతుండంతో బీసీసీఐ కఠిన నియమాలను అమలు చేసింది.
ఐపీఎల్ 2020లో ఓ ఆటగాడు బయో బబుల్ను ఉల్లంఘింగిస్తే.. ఆ జట్టు ప్రాంచైజీ భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా సుమారు ఒక కోటి ఉండొచ్చు. ఓ ప్లేయర్ మొదటిసారి బయో బబుల్ను దాటితే.. 6 రోజుల క్వారంటైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. రెండోసారి కూడా ఉల్లంఘింగిస్తే.. 6 రోజుల క్వారంటైన్తో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురవుతారు. ఇక మూడోసారి బబుల్ను దాటితే.. టోర్నమెంట్ నుంచి వైదొలుగుతారు. అంతేకాదు ఆ జట్టుకు మరొక ఆటగాడిని భర్తీ చేసుకునే అవకాశం ఉండదు.
భారత క్రికెట్ బోర్డు ఈ నియమానాలను అన్ని జట్ల ప్రాంచైజీలకు తెలిపిందని సమాచారం. మరోవైపు ఐపీఎల్ 2020లో పాల్గొన్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మరియు మ్యాచ్ సిబ్బందికి కూడా బీసీసీఐ నిబంధనలను విధించింది. దాదాపు ఆటగాళ్ల నియమాలే వీరికి వర్తించనున్నాయి. జీపీఎస్ ట్రాకర్ ధరించని వారికీ కూడా భారీ జరిమానా పడనుంది. ఇక రాబోయే రెండు నెలలు బయో బబుల్ను ఎవరూ ఉల్లంఘించకుండా చూసుకోవాలని బీసీసీఐ ప్రాంచైజీ యజమానులకు హెచ్చరించిందని తెలుస్తోంది.
చెన్నై బౌలర్ కేఎం ఆసిఫ్ బయోబుడగ నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసింది. బుడగను వదిలివెళ్లిన తొలి ఆటగాడు అతడేనని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధోనీసేన దుబాయ్లోని ఓ హోటల్లో బస చేస్తోంది. చెన్నై శుక్రవారం హైదరాబాద్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ కఠినంగా సాధన చేస్తున్నారు. సాధన చేసేందుకు మైదానానికి వచ్చిన ఆసిఫ్.. తన గది తాళం చెవి పోగొట్టుకున్నట్టు గుర్తించాడు. హోటల్కు వెళ్లి రిసెప్షన్లో నకిలీ తాళం చెవి ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం అతడు బయో బుడగను దాటాల్సి వచ్చింది. దీంతో అతడిని వారం రోజులు క్వారంటైన్కు పంపించారని వార్తలు వ్యాపించాయి.