
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మరో రెండు రోజుల్లో మొదలవనుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్19 నుంచి ఐపీఎల్ ప్రారంభకానున్న విషయం తెలిసిందే. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్ముర ప్రాక్టీస్ చేస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఆటగాళ్లు కూడా తమ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్ క్రిస్ డోనాల్డ్సన్ ఆద్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
ఐపీఎల్ 2020 కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్గా మాజీ ఒలింపిక్ స్ప్రింటర్ క్రిస్ డోనాల్డ్సన్ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ దగ్గరపడడంతో డోనాల్డ్సన్ దగ్గరుండి కేకేఆర్ ప్లేయర్స్ ఫిట్నెస్ పెంచుతున్నాడు. మాజీ స్ప్రింటర్ ఆద్వర్యంలో ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. అతడు రన్నింగ్, జిమ్లలో ప్రత్యేక మెళుకువలు నేర్పుతున్నాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్కు మెషిన్ సాయంతో రన్నింగ్ నేర్పిస్తున్నాడు డోనాల్డ్సన్. ఇలా మాజీ ఒలింపిక్ స్ప్రింటర్ ఆద్వర్యంలో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకున్నారు.
'ఫీల్డింగ్, డైవింగ్, బంతిని బౌండరీ వరకు వెంబడించడం, రనౌట్ చేయడం లాంటివన్నీ క్రికెట్ ఆటలో చాలా ముఖ్యం. అందుకే మేము చాలా కష్టపడుతున్నాం. ఆటగాళ్లకు కదలిక, డైవింగ్, రన్నింగ్ ముఖ్యమైన అంశాలు. అందులోని సమస్యలను పరిష్కరిస్తున్నా. ముఖ్యంగా బౌలర్ల రన్నింగ్ విషయంలో. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంచడమే నా ప్రధాన లక్ష్యం' అని క్రిస్ డోనాల్డ్సన్ తెలిపాడు. 'కేకేఆర్ జట్టుతో పనిచేయడానికి ఆసక్తి ఉందా అని కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అడిగాడు. ఒకవేళ ఏదైనా ఆలోచన ఉంటే మాత్రం వదులుకోవద్దు. మీరు జట్టులోకి రావడం ఎంత అదృష్టమో నాకు తెలుసు అని మెక్కల్లమ్ అన్నాడు' అని డోనాల్డ్సన్ చెప్పాడు.
కోల్కతా నైట్రైడర్స్.. ఐపీఎల్లోనే బలమైన జట్టు. ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కు వెళ్లే వాటిల్లో కచ్చితంగా ఉండే టీమ్. 2012, 14 సీజన్లలో చాంపియన్గా నిలిచిన జట్టు. కానీ గత సీజన్లో ఐదో స్థానానికే పరిమితమైన కేకేఆర్.. ఈసారి భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నది. ముచ్చటగా మూడో టైటిల్ను ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008లో ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ను ఎక్కడికో తీసుకెళ్లిన బ్రెండన్ మెకల్లమ్ హెడ్ కోచ్గా తన పనితనాన్ని చూపెట్టబోతున్నాడు. ఇప్పటికే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో కేకేఆర్ ఫ్రాంచైజీకే చెందిన ట్రిన్బాగో నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన మెకల్లమ్.. ఐపీఎల్ టైటిల్ కూడా అందించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.
వేలంలో కొత్త ప్లేయర్లను తీసుకొని దాదాపుగా సమస్యలన్నిటిని పరిష్కరించుకున్న కేకేఆర్.. ఇయాన్ మోర్గాన్, ఫ్యాట్ కమిన్స్ (రూ. 15.5 కోట్లు) కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. 23న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో తొలి పోరు మొదలుపెట్టనుంది. అభిమానుల అంచనాలను అందుకుంటూ మూడో టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.