
ఆస్ట్రేలియా తరఫున అలా కాదు:
తాజాగా గ్లెన్ మాక్స్వెల్ మాట్లాడుతూ... 'ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. నా ముందు, వెనకా ఎవరెవరు బ్యాటింగ్ చేస్తారో తెలుసు. ఐపీఎల్లో మాత్రం నా పాత్ర ప్రతి మ్యాచ్కు మారుతుంది. ఇక్కడ ప్రతి పోరుకు ఆటగాళ్లు మారతారు. ఆస్ట్రేలియా తరఫున అలా కాదు. ఎక్కువగా ఒకే జట్టు ఉంటుంది. అందువల్లే ప్రదర్శనలో తేడా కనిపిస్తుంది' అని తెలిపాడు.

మార్పులు తప్పవు:
రెండు నెలల టోర్నీ అయినప్పుడు జట్టును అనేక సార్లు మారుస్తుంటారని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ చెప్పాడు. సమతూకం దొరికే వరకు మార్పులు తప్పవని పేర్కొన్నాడు. తమ జట్టుకు ఇప్పుడిప్పుడే సమతూకం వస్తోందని వెల్లడించాడు. ఇప్పటికైతే టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం లేదన్నాడు. తన ముందున్న నలుగురు బ్యాట్స్మెన్కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే తన పాత్రగా మాక్స్వెల్ పేర్కొన్నాడు.

పిచ్లు నెమ్మదిస్తున్నాయి:
యూఏఈ పిచ్లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయని మాక్స్వెల్ తెలిపాడు. ఆసీస్ తరఫున ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని వెల్లడించాడు. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమని మాక్స్వెల్ వెల్లడించాడు. ఐపీఎల్ 2020కి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీసులో మాక్సీ అద్భుతంగా రాణించాడు. ఓ శతకమూ బాదేశాడు. యూఏఈలో మాత్రం భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో 14.50 సగటుతో 58 పరుగులు మాత్రమే చేశాడు.

వెంపర్లాడుతున్న ఫ్రాంచైజీలు:
ప్రతీ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమయ్యే గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు వెంపర్లాడుతున్నాయి. ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ. 9 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ మాక్స్వెల్ను కొనుగోలు చేయగా.. ఈ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రూ. 10.75 కోట్లకు ఈ ఆసీస్ ప్లేయర్ను దక్కించుకుంది. అంతకుముందు కూడా భారీ ధరలకే అమ్ముడుపోయాడు. అయితే మ్యాక్స్వెల్ మాత్రం బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమవుతున్నాడు.