
ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచ్లు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య, ప్రయాణ, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్లో పాల్గొనే యాజమాన్యం, ఆటగాళ్లు, సిబ్బందికి వారం ముందే రెండు కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరి చేశారు.
ఇక యూఏఈలో 6 రోజుల క్వారంటైన్లో ఉండాలని ఐపీఎల్ పాలక మండలి తమ సమావేశంలో నిర్ణయించింది. అయితే డాక్టర్ల సలహాలు, సూచనలతో కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. తాజాగా దుబాయ్ చేరుకున్నాక ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అంగీకరించాయి. ఐపీఎల్ జట్టు యజమానుల సమావేశంలో దీనిపై అన్ని ఫ్రాంఛైజీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 'ఆరోగ్య సమస్యలపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేం. జట్టు సభ్యులందరూ తప్పనిసరిగా ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు' అని ఐపీఎల్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలిపారు.
దుబాయ్ ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆ దేశానికి బయలుదేరే ముందు 96 గంటల్లో పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్గా తేలిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దుబాయ్లోకి ప్రవేశించగానే.. యూఏఈ కోవిడ్-19 టెస్టింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ 'ALHOSN' యాప్ను అందరూ తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఐపీఎల్ 2020లో ఆడేందుకు సిద్ధమవుతున్నా.. క్రికెటర్లలో వైరస్ భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు. మునిపటిలా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. ఎందుకంటే హోటల్ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్ కండిషనింగ్ డక్ట్ల ద్వారా వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది. ఇక పెద్ద సంఖ్యలో పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాయి. రిసార్ట్, అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకునే పనిలో ఉన్నాయని సమాచారం.