
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడడం తన అదృష్టం అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్కే ఓపెనర్ షేన్ వాట్సన్ తెలిపాడు. చెన్నై ప్రాంఛైజీ జట్టులోని ప్రతిఒక్కరిని బాగా చూసుకుంటుందన్నాడు. ఐపీఎల్లో తనని తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సీఎస్కే ఫ్రాంచైజీకి వాట్సన్ కృతజ్ఞతలు చెప్పాడు. 2019లో ఒకానొక సమయంలో తక్కువ స్కోర్లు చేసినప్పటికీ తనకు చెన్నై మేనేజ్మెంట్ నుంచి మద్దతు లభించిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. 2019లో వాట్సన్ 398 పరుగులు చేశాడు. 2018 నుంచి వాట్సన్ చెన్నై తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు బెంగళూరు, రాజస్థాన్ జట్లకు ఆడాడు.
తాజాగా నబీల్ హష్మి యూట్యూబ్ షోలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ... '2018 ఐపీఎల్ నా మెరుగైన సీజన్లలో ఒకటి. ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. అది ఫైనల్ మాత్రమే కాదు.. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. కానీ గత సంవత్సరం ఎక్కువగా పరుగులు చేయలేదు. ఇతర జట్లలో పరుగులు చేయకుంటే.. కొన్ని మ్యాచులకు పక్కనపెట్టేవారు. కానీ చెన్నై జట్టు నాకు అండగా నిలిచింది. నేను కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడగలననే నమ్మకం సీఎస్కే ప్రాంచైజీకి ఉంది. ధోనీ, ఫ్లెమింగ్ నా ఆటపై నమ్మకముంచి ప్రోత్సహించారు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పుడు కూడా ధోని మరియు ఫ్లెమింగ్ నా ఆటను మెచ్చుకున్నారు. ప్రపంచ స్థాయి నాయకులు మాత్రమే ఇలా మద్దతుగా ఉంటారు' అని అన్నాడు.
'చెన్నై నాయకుల నుంచి చాలా నేర్చుకున్నా. ఒకరిని సామర్థ్యాన్ని నమ్మితే.. వారు నిరూపించుకోవడానికి వీలుంటుంది. చెన్నై ఆ విధంగానే చేస్తది. సీఎస్కేకు నాపై పూర్తి నమ్మకం ఉంది. చెన్నై తరఫున ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఎంఎస్ ధోనీని కొనియాడేవాడిని. మహీ మైదానంలో మరియు బయట జట్టును అద్భుతంగా నడిపిస్తాడు. గత కొన్నేళ్లుగా నా కెరీర్లో ఈ అద్భుత సమయాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. చెన్నై ప్రాంఛైజీ జట్టులోని ప్రతిఒక్కరిని బాగా చూసుకుంటుంది' అని షేన్ వాట్సన్ తెలిపాడు. సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో సీఎస్కే తలపడుతుంది. ప్రస్తుతం యూఏఈలో సీఎస్కే మమ్మురంగా ప్రాక్టీస్ చేస్తోంది.
2018లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో షేన్ వాట్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన వాట్సన్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2018 ఐపీఎల్ ఫైనల్లో పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. చెన్నైకి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాట్సన్ మొదటి ఓవర్ను మెయిడిన్ చేశాడు. ఇక తన మొదటి 10 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆపై వాట్సన్ తన టైమింగ్ను అందుకున్నాడు. ప్రతి ఓవర్లో రెండు బౌండరీలు కొడుతూ.. 33 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఆపై 51 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో చెన్నై అద్భుత విజయం అందుకుంది.