
దుబాయ్: గత 52 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 చరమాంకానికి చేరింది. మంగళవారం రాత్రి జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదో టైటిల్పై గురి పెట్టగా.. లీగ్లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ అదే జోష్లో టైటిల్ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. క్వాలిఫయర్-1లో ముంబై చేతితో చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ.. ఈసారి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరి ఈ బిగ్ఫైట్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ మీడియాతో మాట్లాడారు. 'గతంలో ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అనుభవం ఉండటం వల్ల మానసికంగా ప్రత్యర్థిపై మాదే కాస్త పైచేయి. కానీ ఐపీఎల్లో ప్రతి రోజూ కొత్తదే. ఎప్పటికప్పుడు కొత్త ఒత్తిడి తప్పదు. కాబట్టి గతాన్ని దృష్టిలో ఉంచుకుంటే కష్టం. మేం పాలనా జట్టుతో ముందే ఆడాం, గెలిచాం అని మేం ఆలోచించకూడదు. ఫైనల్లో ఓ కొత్త ప్రత్యర్థితో తలపడుతున్నట్లే భావించాలి' అని రోహిత్ పేర్కొన్నాడు.
'మైదానంలో ఏం చేయాలో అది చేసి ఐదవ టైటిల్ను మా ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాం. మా జట్టు బలంగా, సమతూకంతో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. నిజాయితీగా చెప్పాలంటే మా జట్టులో ఏ లోపాలూ కనిపించడం లేదు. అయితే ఇందుకోసం మేమెంతో కష్టపడ్డాం. క్వింటన్ డికాక్ నుంచి జస్ప్రీత్ బుమ్రా వరకు అందరినీ అన్ని జట్లూ ఎంచుకోవచ్చు. మా జట్టు యాజమాన్యం ఆటగాళ్లపై నమ్మకం పెట్టి వారిని తీర్చిదిద్దుకుంది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
'ఢిల్లీ తొలిసారి ఐపీఎల్ ఫైనల్ చేరడం చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఈ సీజన్లో మా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒకసారి ఆనందం.. ఆ వెంటనే నిరుత్సాహం. సమష్టి కృషి వల్లే తుది సమరానికి అర్హత సాధించగలిగాం. ప్రతి ఒక్కరూ విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముంబైతో జరిగే ఫైనల్లోనూ జోరు ప్రదర్శిస్తామని ఆశిస్తున్నా. రోహిత్ సేన బలమైన జట్టు. వారిపై స్వేచ్ఛగా ఆడాల్సి ఉంది' అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.
'ఎన్నో ఆశలతో మేం యూఏఈకి వచ్చాం. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ బాగానే గడిచినా.. అసలు పని ఇంకా పూర్తికాలేదు. ఐపీఎల్ టైటిల్ గెలవాలన్నదే మా లక్ష్యం. అందుకోసం ఫైనల్లో మా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాం. ఎంతో క్రికెట్ ఆడినా ఒక్కసారి కూడా ఐపీఎల్ ఫైనల్లో ఆడే అవకాశం రానివారితో పోలిస్తే.. మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి మైదానంలో ఎలాంటి ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా ఆడాలని మా కుర్రాళ్లకు చెప్పా. సీజన్లో ఇప్పటికే మూడు సార్లు ఓడినా సరే.. ముంబైపై గెలిచే సత్తా మా జట్టుకు ఉందని నమ్ముతున్నా' అని రికీ పాంటింగ్ అన్నాడు.