ధోనీని వెంటాడిన అభిమానులు:
ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 మొదలవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్లో మహీ పాల్గొన్నాడు. స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం చెన్నై ఆటగాళ్లు బస్సులో హోటల్కు వెళ్తుండగా.. ధోనీని చూసిన ఫాన్స్ ఫాలో చేయడం మొదలెట్టారు. ఫాన్స్ అందరూ తన టూ వీలర్లతో వెంబడించారు.
|
కార్నర్ సీటులో మహీ:
చెన్నైలోని ఓ సిగ్నల్స్ దగ్గర బస్సు ఆగినప్పుడు ధోనీని తమ మొబైల్ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. మహీకి అభివాదం చేస్తూ కేకలు, ఈలలతో హోరెత్తించారు. ధోనీ.. ధోనీ అంటూ బస్సు వెళుతున్నా కొద్ది ఫాలో అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ఈ సీజన్ మొదటి ప్రాక్టీస్ సెషన్. తలా ఎంఎస్ ధోనీ తిరిగి టీం బస్సులో తనకు ఇష్టమైన కార్నర్ సీటులో కూర్చున్నాడు' అని ఎంఎస్ ధోనీ ఫాన్స్ అఫీషియల్ ఖాతాలో రాసుకొచ్చారు.
దద్దరిల్లిన మైదానం:
సోమవారం చిదంబరం స్టేడియంలో ధోనీ క్రికెట్ సాధన మొదలుపెట్టాడు. నెట్స్లో బ్యాటింగ్ చేశాడు. హిట్టింగ్తో ఫ్యాన్స్ను ధోనీ అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అతడు బ్యాటు పట్టి అడుగుపెట్టే సమయంలో చిదంబరం స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అభిమానులు 'ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ' అంటూ నినాదాలు చేశారు.
తొలి మ్యాచ్లో ముంబైతో చెన్నై ఢీ:
ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్తో ఓటమి పాలైన తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెట్టని విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్ జట్టుతో కలిసి ఓ వారం సాధన చేసాడు. మహీ ఈసారి ఐపీఎల్కు కొత్త హెయిర్స్టయిల్తో దర్శనమిస్తున్నాడు. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.